
● ఏళ్లుగా కబ్జాలో ఉన్న రైతులకు బెదిరింపులు ● తాజాగా సాగ
ఈ చిత్రంలో కనిపిస్తున్న దళిత రైతు పేరు మాలెం రమాదేవి. ఏళ్లుగా ఈ భూమిలో తమ తాత కాలం నుంచి కాస్తులో ఉంటున్నారు. పంటలు సాగు చేసుకుంటున్నారు. వీరి తండ్రి చనిపోగా.. నలుగురు అక్కాచెల్లెళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. రెండ్రోజుల క్రితం పత్తి చేనును రాత్రివేళ వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్తో చదును చేసి ధ్వంసం చేశారు. గత కొంతకాలంగా తాము సాగులో ఉన్న భూమి కబ్జాకు కొందరు ప్రయత్నిస్తున్నారని బాధితులు మంచిర్యాల పోలీసుస్టేషన్, తహసీల్దార్ను కలిసి ఫిర్యాదు ఇచ్చారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నిరుపేద దళితుల భూములపై రియల్ ఎస్టేట్ గద్దలు వాలుతున్నాయి. జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్లో ఉన్న సర్వేనంబరు 345లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సర్వే నంబరులో రికార్డులు మార్చేస్తున్నారు. ఇదే సర్వేనంబరులో జంగ్సిపాయిలకు చెందిన భూములు 60ఎకరాల చొప్పున మొత్తం 120 ఎకరాలు ఉంది. ఈ భూముల్లో రైతులు సాగులో ఉన్నారు. ఈ భూములను సిపాయిల వారసులుగా కొందరు రంగప్రవేశం చేసి రియల్ వ్యాపారులకు రిజిస్ట్రేషన్లు చేశారు. జిల్లా కేంద్రంలో ఉండడం, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడంతోపాటు జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఈ భూములపై కొందరు కన్నేసి భూ దందాలకు పాల్పడుతున్నారు. నిరుపేద దళితులు ఉన్న ఈ భూములపై ఏళ్లుగా సాగులో ఉన్నా హక్కులు లేకపోవడంతో అడ్డదారిలో భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు.
రికార్డులు మార్చేస్తూ..
రాజీవ్నగర్ సమీపంలో ఉన్న 345 సర్వేనంబరులో జంగ్ సిపాయి భూములతోపాటు మరో వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో మందమర్రి మండలం అమర్వాదికి చెందిన పలువురు రైతులు ఏళ్లుగా సాగులో ఉన్నా హక్కులు పొందలేకపోయారు. దీంతో ఇదే అదునుగా రికార్డులు మార్చుతూ తమకు అనుకూలంగా చేసుకుంటూ అనేమందికి తక్కువ ధర ఆశ చూపిస్తూ అమ్మేశారు. అయితే కబ్జాలో వేరే రైతులు, రికార్డుల్లో మాత్రం వేరేవాళ్లు ఉన్నారు. దీంతో కబ్జాలో ఉన్నవారిని బలవంతంగా ఆ భూముల నుంచి లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు తెలియకుండానే భూముల రిజిస్ట్రేషన్లు కావడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వివాదాలు ఉన్నాయని పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన వారంతా ఇబ్బందుల్లో పడ్డారు.
అర్జీలు ఇస్తున్నా హక్కులు రాలే..
ఏళ్లుగా ఇక్కడ సాగులో ఉన్నప్పటికీ భూ యాజమాన్య హక్కులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు నయానో, భయానకో రియల్ వ్యాపారులకు విలువైన భూములను అమ్మేసుకుంటున్నారు. అయితే కొందరు కాస్తులో ఉన్నవారు భూ ప్రక్షాళన, ధరణి సందర్భంలోనూ అర్జీలు ఇచ్చినప్పటికీ పట్టాలు రాలేదు. మరోవైపు కబ్జాలో ఉన్న వారికి భూమిపై హక్కులు రావని చెబుతూ రియల్వ్యాపారులే బెదిరిస్తూ ఆ భూముల్లో లేకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ భూములపై పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

● ఏళ్లుగా కబ్జాలో ఉన్న రైతులకు బెదిరింపులు ● తాజాగా సాగ