అజ్ఞాతం వీడుతున్నారు..! | - | Sakshi
Sakshi News home page

అజ్ఞాతం వీడుతున్నారు..!

Jul 16 2025 3:51 AM | Updated on Jul 16 2025 3:51 AM

అజ్ఞాతం వీడుతున్నారు..!

అజ్ఞాతం వీడుతున్నారు..!

● జనంలోకి మావోయిస్టులు ● ఉమ్మడి జిల్లా నేతల లొంగుబాటు ● ఆపరేషన్‌ కగార్‌తో పంథా మారిన వైనం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ చేపట్టినప్పటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో మరణించడమో.. లొంగిపోవడమో జరుగుతోంది. ఇప్పటికీ కొందరు దశాబ్దాలుగా కుటుంబ సభ్యులు, సొంతూరును విడిచి అడవుల్లోనే గడుపుతున్నారు. రోజు రోజుకు పోలీసు బలగాలు అడవులు, మావోయిస్టు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం, మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు ఒక్కొక్కరుగా ఉద్యమానికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు కోరుతున్నారు. తాజాగా మావోయిస్టు దంపతులు అజ్ఞాతం వీడగా.. ఊరిలో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.

ఉనికిని కోల్పోతున్న పార్టీ

నిత్యం పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య ఘర్షణ నుంచి నేడు పార్టీ ఉనికే లేకుండాపోయే రోజులొచ్చాయి. గడచిన ఏడాదిలోనే పార్టీ వేగంగా క్షీణిస్తోంది. కేంద్ర కమిటీలో పని చేసిన కటకం సుదర్శన్‌ ఉరఫ్‌ ఆనంద్‌(69) మొదలు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ, గడ్చిరోలీ జిల్లా ఇన్‌చార్జి కాసర్ల రవి ఉరఫ్‌ అశోక్‌, కంతి లింగవ్వతోపాటు అనేక మంది సీనియర్లను పార్టీ కోల్పోయింది. 2020లో కాగజ్‌నగర్‌ మండలం కడంబా ఎన్‌కౌంటర్‌లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన బాదీరావు చనిపోయారు. గత నెల 6న రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేబీఎం కమిటీ ఇన్చార్జీ మైలరాపు అడెల్లు ఉరఫ్‌ భాస్కర్‌ ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ అడవుల్లో జరిగిన కాల్పుల్లో మరణించారు. ఆయనపై రూ.45లక్షల రివార్డు ఉంది.

దళంలోనే ఒక్కటై..

తాజాగా లొంగిపోయిన మావోయిస్టులు లచ్చన్న, అంకుబాయి అప్పట్లో క్రియాశీలకంగా ఉన్న సిర్పూర్‌ దళంలోనే పని చేస్తూ ఒక్కటయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్‌పల్లికి చెందిన లచ్చన్న 1983లో పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ చెన్నూరు దళంలో చేరారు. 2002లో డివిజనల్‌ కమిటీ సభ్యుడిగా, 2007లో నార్త్‌ బస్తర్‌ డివిజన్‌ కమిటీ సాంకేతిక విభాగం ఇన్చార్జీగా పని చేశారు. 2023నుంచి దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. ఈయనపై పలు పోలీసుస్టేషన్లలో 35కేసులు ఉన్నాయి.

అన్న వచ్చిన 37ఏళ్లకు

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ మండలం అగర్‌గూడకు చెందిన చౌదరి అంకుబాయి 1988లో తన అన్న చిన్నన్నను కలిసేందుకు వచ్చి పార్టీలోకి వెళ్లింది. పీపుల్స్‌వార్‌ సిర్పూర్‌ దళ సభ్యురాలిగా చేరి, ఆ సమయంలోనే ఆత్రం లచ్చన్నను పెళ్లి చేసుకుంది. 1995లో లచ్చన్నతో పట్టణ ప్రాంతానికి బదిలీ కాగా, 2002లో ఏరియా కమిటీ సభ్యురాలిగా, తర్వాత దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సాంకేతిక విభాగానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం నార్త్‌ బస్తర్‌ డివిజనల్‌ కమిటీ టెక్నికల్‌ విభాగం సభ్యురాలిగా ఉన్నారు. ఈమైపె 14కేసులు ఉన్నాయి. అయితే అన్న కోసం అడవికి వెళ్లిన అంకుబాయి చిన్నన్న కొన్నేళ్ల క్రితమే లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్నారు. చెల్లె మాత్రం గత 37ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉండిపోయింది.

మిగిలిందెందరు?

గతంలో అనేకమంది ఉమ్మడి జిల్లా నుంచి వివిధ రాష్ట్రాల్లో పలు హోదాల్లో పని చేసేవారు. ప్రస్తుతం వారి సంఖ్య పదిలోపే చేరింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు కీలక హోదాల్లో ఉన్నారు. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కూచన్‌పల్లికి చెందిన ఇర్రి మోహన్‌రెడ్డి, సెంట్రల్‌ పోలిట్‌ బ్యూరో కేంద్ర కమిటీలో సాంకేతిక విభాగంలో ఉన్నారు. మరో ముఖ్య నేత మందమర్రికి చెందిన బండి ప్రకాశ్‌ ఉరఫ్‌ దాదా సింగరేణి కోల్‌బెల్ట్‌ కమిటీ చూస్తున్నారు. ఈయనను కేంద్ర కమిటీలోకి తీసుకున్నట్లుగా సమాచారం. అలాగే ఈయన సహచరులుగా ఉన్న పుల్లూరి ప్రసాదరావు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. సలాకుల సరోజ, జాడి వెంకటి, పుష్పలత ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement