● రూ.4 లక్షల వరకు ఆస్తినష్టం
పెద్దకొత్తపల్లి: రైతులు పండించిన మొక్కజొన్న పంట చివరకు అగ్గిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని చంద్రకళ్ శివారులోని సంజీవపూర్, చంద్రకళ్కు చెందిన రైతులు మొక్కజొన్న పంటను ఏరి నూర్పిడి కోసం వ్యవసాయ పొలంలో కుప్పలు, కుప్పలుగా పోసి నిల్వ చేశారు. మంగళవారం సాయంకాలం ప్రమాదవశాత్తుతో అకస్మాత్తుగా మంటలు ఏర్పడి మొక్కజొన్న కొయ్యలు కాలుతూ నూర్పిడి కోసం కుప్పలుగా నిల్వ ఉంచిన మొక్కజొన్న కుప్పలకు నిప్పంటుకొని పంట పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మొక్కజొన్న సాగు చేసిన రైతులు బాలయ్య, స్వామి, నిరంజన్, లక్ష్మయ్య, వెంకటయ్య రైతులతోపాటు మరికొంత మంది రైతుల పంట, వ్యవసాయ పరికరాలు మంటలల్లో దగ్ధమయ్యాయని రైతులు వాపోయారు. సమాచారం తెలుసుకున్న జీపీఓ ఖాజాభాను ఘటన స్థలానికి చేరుకొని రైతుల పంట పొలాలను పరిశీలించి అనంతరం మంటల్లో దగ్ధమైన మొక్కజొన్న పంట నిల్వలను పంచనామా నిర్వహించి నష్టం విలువను నమోదు చేసుకున్నారు. మండలస్థాయి అధికారులకు నివేదిస్తామన్నారు. ప్రభుత్వపరంగా సాయం చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


