అన్నదాత.. గుండెకోత | - | Sakshi
Sakshi News home page

అన్నదాత.. గుండెకోత

May 21 2026 12:38 AM | Updated on May 21 2026 12:38 AM

కుమ్మక్కుతో దందా..

తాలు పేరిట 25 క్వింటాళ్లు దోచుకున్నారు..

తాలు పేరిట మిల్లర్ల నిలువు దోపిడీ

క్వింటాల్‌కు 3 నుంచి 5 కిలోల వరకు మాయాజాలం

రైతులకు కనీస సమాచారం

ఇవ్వకుండానే వ్యవహారం

కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సిబ్బందితో కుమ్మక్కు

లారీ డ్రైవర్ల పేరు చెబుతూ

పొంతనలేని సమాధానాలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంకా

నత్తనడకనే క్రయవిక్రయాలు

తూతూమంత్రపు పరిశీలనలకే

అధికారుల పరిమితం

ఫొటోలో ఉంది పెద్ద దర్పల్లిలోని సప్తగిరి పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లు నిర్వాహకులు ఇచ్చిన ట్రక్‌ షీట్‌. మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ మండలం వింజమూరు ప్రభుత్వ సెంటర్‌లో భీమయ్యయాదవ్‌తో పాటు మరో ఏడుగురు రైతుల నుంచి 856 బస్తాల (342 క్వింటాళ్లు) ధాన్యాన్ని కొనుగోలు చేసి సదరు రైస్‌ మిల్లుకు తరలించారు. అక్కడ తూకం తక్కువగా వచ్చిందంటూ మిల్లర్లు 825 బస్తాలకే లెక్కగట్టారు. ఆ తర్వాత మరో మూడు బస్తాలు కలిపి 331 క్వింటాళ్లకు డబ్బులు చెల్లిస్తామని ఫైనల్‌ చేశారు. అంటే 31 బస్తాలు (11 క్వింటాళ్లు) తక్కువ చూపించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు రైతులు మిల్లు నిర్వాహకులను నిలదీశారు. తమకు చెప్పకుండానే ఎలా చేస్తారని ప్రశ్నించారు. సెంటర్ల నిర్వాహకులకు చెప్పామని మిల్లరు తెలపగా.. అక్కడికి వెళ్లారు. వారు లారీ డ్రైవర్‌కు చెప్పామని చేతులు దులుపుకోవడంతో మోసం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరో లారీకి సంబంధించి మోసపూరితంగా ఇలానే 30 బస్తాల కోత పెట్టారని.. సెంటర్లలో నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప తమకు న్యాయం చేయాలనే స్పృహ అధికారుల్లో కొరవడిందని రైతు భీమయ్య యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎండా కాలం సాగుకు సంబంధించి ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో ఇప్పటివరకు కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరుగుతురన్నాయి. సీజన్‌ ముగిసే దశకు చేరుకున్నా.. నిర్దేశిత లక్ష్యంలో కనీసం 30 శాతం చేరుకోలేదు. హమాలీలు, లారీల కొరతతోపాటు మిల్లుల్లో స్థలాభావం వంటి కారణాలు కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇది చాలదన్నట్లు రోజుల తరబడి నిరీక్షణతో కష్టనష్టాలకు ఓర్చి సర్కారు సెంటర్లలోనే అమ్ముకుందామనుకున్న రైతులకూ భంగపాటు తప్పడం లేదు. మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు తాలు పేరిట నిలువు దోపిడీకి తెగబడడంతో వారు గుండెలు బాదుకుంటున్నారు. పాలక పక్షంలో కొరవడిన చిత్తశుద్ధి, అధికారుల తూతూమంత్రపు పర్యవేక్షణతోనే ఈ దుస్థితి నెలకొనగా.. అన్నదాతలు అరిగోస పడుతున్నారు.

కేవలం 2,89 లక్షల మెట్రిక్‌ టన్నులే..

మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 1,018 సెంటర్లు కేటాయించారు. ఇందులో 900 వరకు మాత్రమే తెరుచుకున్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 11,49,813 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ధారించారు. అయితే 19వ తేదీ వరకు ఆయా ప్రభుత్వ కేంద్రాలకు సుమారు 3,42,939 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చింది. ఇందులో ఇప్పటివరకు 2,89,135 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కేంద్రాల్లో ఇంకా 66,082 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. సరిపోను హమాలీలు లేకపోవడం, లారీల కొరతతో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెంటర్లలో కొనుగోలు చేసిన ధాన్యంలో సుమారు 33,416 మెట్రిక్‌ టన్నులను ఇంకా మిల్లులకు తరలించాల్సి ఉండగా.. బస్తాల వద్ద రైతులు రోజుల తరబడి కాపలా కాస్తున్నారు.

జిల్లాల వారీగా ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల వివరాలు..

జిల్లా మార్కెట్‌కు కొన్నది ఇంకా మిల్లులకు రసీదు

వచ్చింది కేంద్రాల్లోఉంది తరలించింది ఇచ్చింది

మహబూబ్‌నగర్‌ 67,420 56,620 10,800 54,338 53,150

వనపర్తి 1,20,000 94,291 36,000 70,000 69,000

నాగర్‌కర్నూల్‌ 6,500 4,600 2,000 4,028 1,966

జోగుళాంబ గద్వాల 46,019 34,735 11,284 34,462 34,462

నారాయణపేట 1,03,000 98,889 5,998 92,891 91,089

సెంటర్లలో తూకం వేసిన రసీదు ఉంది.. నేరుగా మిల్లులకు వచ్చిన తర్వాత తూకం ఎలా తక్కువ వస్తుందని ప్రశ్నిస్తే తేమ ఎక్కువగా ఉంది.. ఒప్పుకోకుంటే తీసుకెళ్లండి అంటూ మిల్లుల నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. అంతేకాకుండా రైతులకు సమాచారం ఇవ్వకుండానే మిల్లర్లు బస్తాల సంఖ్యను కుదించి.. ఆ మేరకు బిల్లులు చేస్తున్నట్లు సమాచారం. సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మకై ్క దందా నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతు ధర వస్తుందనే ఆశతో రోజుల తరబడి పడిగాపులు కాచినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. చివరకు నష్టపోక తప్పడం లేదని ‘సాక్షి’ బృందం పరిశీలన సందర్భంగా పలువురు రైతులు కన్నీటిపర్యంతమయ్యారు.

రాత్రింబవళ్లు కష్టపడితే 514 క్వింటాళ్ల ధాన్యం పండింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన సెంటర్‌లో కొనుగోలు చేసిన తర్వాత ధాన్యాన్ని గాయత్రి మిల్లుకు తీసుకెళ్లాం. అక్కడ మిల్లు నిర్వాహకులు తాలు పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. క్వింటాల్‌కు ఏకంగా 5 కిలోల చొప్పున తరుగు తీస్తేనే అన్‌లోడ్‌ చేస్తామని మొండికేశారు. నిబంధనల ప్రకారం క్వింటాల్‌కు కిలో కంటే ఎక్కువ తరుగు తీయొద్దు. అధికారులకు మొరపెట్టుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. వాహన అద్దె భారం మోయలేక.. చేసేదేమీ లేక వారి దోపిడీకి తలవంచాల్సి వచ్చింది. దాదాపు 25 క్వింటాళ్ల పైగా ధాన్యాన్ని ఉచితంగా మిల్లర్ల పాలైంది. మా ఆవేదన ప్రభుత్వానికి వినబడడం లేదు.

– రాజు, అజ్జకొల్లు, మదనాపురం, వనపర్తి

Advertisement
 
Advertisement
Advertisement