మహబూబ్నగర్ క్రీడలు: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘యువజన క్రీడల వారోత్సవాలు’ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ‘యూత్ లీడర్ షిప్ సమ్మిట్’ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 23వ తేదీ వరకు యువజన, క్రీడల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం ప్లే, పార్టిసిపేట్–స్పోర్ట్స్డే సందర్భంగా జిల్లా యువజన, క్రీడల ఆధ్వర్యంలో మెయిన్ స్టేడియంలో అథ్లెటిక్స్, కబడ్డీ, బాస్కెట్బాల్, వాలీబాల్, ఫుట్బాల్, హ్యాండ్బాల్ పోటీలు, 22న సర్వ్, సపోర్టు తెలంగాణ–క్లీన్ తెలంగాణలో భాగంగా స్వచ్ఛ క్రీడల మైదానాల్లో, అన్ని మండలకేంద్రాల్లో యువ వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు, క్రీడాకారులు పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతారని తెలిపారు. అదే విధంగా 23న ఉద్యోగ సాధన–అవకాశాలతో ప్రతిభను అనుసంధానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సృజన్కుమార్ యువత నాయకత్వంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల కోచ్లు పాల్గొన్నారు.


