స్టేషన్ మహబూబ్నగర్: వేసవి సెలవుల్లో విద్యార్థులు తమ సృజనను పెంపొందించుకునేందుకు పిల్లలమర్రి బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో మే 2వ తేదీ నుంచి 22 వరకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బెక్కం జనార్దన్, డాక్టర్ ప్రతిభ తెలిపారు. జిల్లాకేంద్రంలోని రెయిన్బో హైస్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 20 రోజులపాటు జరగనున్న శిబిరాలను రెయిన్బో హైస్కూల్లో నిర్వహిస్తామని, ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శిబిరం ఉంటుందన్నారు. 8 ఏళ్లు పైబడిన బాల, బాలికలకు జానపద నృత్యం, వెస్ట్రన్ డాన్స్, చిత్రలేఖనంలో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. పిల్లలు సెల్ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి సృజనాత్మకత కార్యక్రమాల వైపు మళ్లేందుకు ఈ శిక్షణ ఉపకరిస్తుందన్నారు. శిక్షణలో పాల్గొనాలనుకునే వారు సెల్ నం.93983 05993ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అనంతరం వేసవి శిబిరం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు.


