● బండరాయితో మోది దారుణంగా..
● ఆనవాళ్లు లేకుండా నీటితో శుభ్రం
కొత్తపల్లి(మద్దూరు): బండరాయితో మోది హత్య చేసిన సంఘటన మద్దూరు మండల పరిధిలోని ఖాజీపూర్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. ఖాజీపూర్ గ్రామానికి చెందిన ఎండీ అహ్మద్(37) వృత్తిరీత్యా మద్దూరు పట్టణంలో మెకానిక్ పని చేస్తున్నాడు. ఇటీవల తన సొంత గ్రామంలోని పొలంలో ఫౌల్ట్రీఫాం నిర్మాణ చేపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఫాంలో పడుకొని ఉండగా గుర్తు తెలియని దుండగులు దాడిచేసి బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం దాడి జరిగిన ప్రదేశంలో ఆనవాళ్లు కనిపించకుండా బోరు మోటార్ నీటితో శుభ్రం చేసి అహ్మద్ శవంపై ఉన్న రక్తపు మరకలు లేకుండా చేసి పరారయ్యారు. మంగళవారం ఉదయం పొలాలకు వెళ్లున్న రైతులు నీరు వృథాగా పోతుందని దగ్గరకు వెళ్లి చూడగా విగతజీవుడై పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న కోస్గి సీఐ సైదులు, ఎస్ఐ బాల్రాజ్ ఘటనా స్థలికి చేరుకొని డాగ్ స్క్వాడ్, బయోమెట్రిక్ ఆనవాళ్లు తీసుకున్నారు. మృతుడి భార్య సాహిబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు మద్దూరు ఇన్చార్జి ఎస్ఐ రేవతి తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఆస్పత్రికి తరలించారు.
మార్లబీడులో వ్యక్తి మృతి
ధరూరు: మండల పరిధిలోని మార్లబీడులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన నర్సింహులు (37) గ్రామ సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి కాళ్లకు రక్తగాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నందికర్ డాగ్స్క్వాడ్తో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.


