మహమ్మదాబాద్: విద్యుత్ ట్రాన్స్పార్మర్ను పట్టుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహమ్మదాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి(40) అన్నారెడ్డిపల్లి రోడ్డు సమీపంలో గేటుకు 100మీటర్ల దూరంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్లాడు. అక్కడే తాను వేసుకున్న చెప్పులను వదిలి నేరుగా ట్రాన్స్పార్మర్ను పట్టుకున్నాడు. వెంటనే ఫీజులు ఎగిరి పెద్దగా శబ్ధం వచ్చి అక్కడే పడిపోయాడు. దీంతో నిప్పులు వచ్చి మంటలు చెలరేగి అక్కడే మృతిచెందాడు. అక్కడే పొలాల్లో పనిచేస్తున్న మహిళలు వచ్చి చూడగా అప్పటికే మృతిచెంది మంటల్లో చిక్కుకున్నాడు. స్థానికులు మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి స్థానికుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని మృతదేహాన్ని మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతుడు గుర్తుతెలియని వ్యక్తి కావునా గులాబిరంగు చొక్కా జీన్స్ ప్యాంటు ధరించినట్టు గుర్తులు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు మహమ్మదాబాద్ పోలీసులను సందర్శించాలని ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటు చేయకపోవడంతో వెంటనే కంచెను ఏర్పాటు చేయాలని కోరారు.
వ్యక్తి బలవన్మరణం
నవాబుపేట: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కామారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడిగే చంద్రయ్య(61) కుటుంబ పోషణ భారంగా మారండంతో తరుచూ ఇంట్లో గొడవ పడేవాడు. ఈనెల 26న ఆదివారం తన భార్యతో తగాదా పెట్టుకున్నాడు. అనంతరం రాత్రి భోజనం చేసి కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రించగా.. చంద్రయ్య ఒక్కడే ఇంటిపై ఉన్న మరో గదిలో నిద్రించాడు. రాత్రి సమయంతో ఆయన నిద్రించిన గదిలో నుంచి శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు లేచిచూసే సరికి ఇంటి పైకప్పునకు పంచెతో ఉరేసుకొని కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తలిరించారు. చికిత్స ిపొందుతూ సోమవారం మృతిచెందాడు. భార్య పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు.
రెండు బైకులు ఢీ..రైతు మృతి
● కుమార్తెకు తీవ్ర గాయాలు
దామరగిద్ద: పొలం దగ్గరకు తన కుమార్తెతో కలిసి బైకుపై వెళ్లిన రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు కథనం ప్రకారం.. మద్దూర్ మండలానికి చెందిన రైతు తిరులమలప్ప (56) అయ్యవారిపల్లి శివారులోని తన పొలానికి బైకుపై కుమార్తె జ్యోతి కలిసి వెళ్తుండగా మార్గమధ్యలో అయ్యవారిపల్లి మలుపు సమీపంలో వెనుక నుంచి అతివేగంగా బైకుపై వస్తున్న మోమినాపూర్కు చెందిన వెంకటేష్ ఢీకొట్టాడు. ప్రమాదంలో తిరుమలప్ప, జ్యోతి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు మద్దూర్ ఆస్పత్రికి తరలించారు. తిరుమలప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. జ్యోతికి చికిత్స పొందుతుంది. మృతుడి భార్య చెన్నమ్మ ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ తెలిపారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
కృష్ణా: వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని టైరోడ్డులో ఆదివారం జరిగింది. ఎస్ఐ నవీద్ వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తి టై రోడ్డుపై వడదెబ్బ కారణంగా సొమ్మసిల్లి కిందపడ్డాడు. అటువైపుగుండా వెళ్తున్న పోలీసులు గమనించి చికిత్స నిమిత్తం రాయచూర్లోన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే పోలీసులను సంప్రదించాలని కోరారు.
బావిలో పడి వ్యక్తి మృతి
గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గద్వాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన తెలుగు శ్రీను (45) మున్సిపల్ కార్యాలయంలోని బావి వద్ద స్నానం చేసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలో రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. జడ్చర్ల పట్టణానికి చెందిన పావని(43) జాతీయ రహదారిపై జమ్జమ్ హోటల్ సమీపంలో రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందింది. ఈ విషయంలో మృతురాలి కుమారుడు జస్వంత్రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ కమలాకర్ తెలిపారు.


