జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రజావాణి ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆమె అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియతో కలిసి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణిలో పంచాయతీరాజ్, మున్సిపల్, జిల్లా సంక్షేమం, భూసర్వే రికార్డులు, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, బ్యాంకింగ్, పోలీస్, విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 102 వినతులను అధికారులు నమోదు చేసుకున్నారు. అలాగే ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి వచ్చేనెల 2 వరకు బాలల భద్రత, డ్రగ్స్ నిరోధం, మే 4 నుంచి 9 వరకు వ్యవసాయ శాఖ ద్వారా రైతు వారోత్సవాలు, మే 2న నియోజకవర్గ స్థాయిలో చేపట్టే కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆమె చాంబర్లో ఆవిష్కరించారు.
● కలెక్టరేట్లో మంగళవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. సమావేశానికి అన్ని శాఖల అధికారులు ఉదయం 10 గంటలకు హాజరై, జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాంరెడ్డి, ఆర్డీఓ నవీన్, జెడ్పీసీఈఓ, ఇన్చార్జి డీపీఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు


