ఉపాధ్యాయులే
యజమానులు..?
పేర్లు మార్చి కొనసాగింపు..
● ఐఐటీ, నీట్, ఎఫ్సెట్ వంటి వాటికి కొత్త ట్రెండ్
● నవోదయ, గురుకుల, సైనిక్ స్కూల్ పోటీ పరీక్షలకు సైతం శిక్షణ
● షార్ట్, లాంగ్టర్మ్ కోచింగ్, హాస్టళ్లు సైతం కొనసాగింపు
● అన్నీ తెలిసినా.. పట్టనట్లుగా
అధికారుల తీరు
న్యూటౌన్లో నిర్వహిస్తున్న
ఓ కోచింగ్ సెంటర్
రాజేంద్రనగర్లోని నిర్వహిస్తున్న ఓ కోచింగ్ సెంటర్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు విద్యాశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ, ఇక్కడి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వాటిని తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగియగా.. ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి వాటికి డిమాండ్ ఉండడంతో పెద్దఎత్తున లాంగ్టర్మ్, షార్ట్టర్మ్ కోచింగ్ ఇస్తున్నారు. గతంలో ఎస్ఐ, కానిస్టేబుల్కు శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లు సైతం ప్రస్తుతం ఐఐటీ, నీట్కు శిక్షణ ఇవ్వడం గమనార్హం. వీటితోపాటు నవోదయ, గురుకులాలు, సైనిక్ స్కూల్స్కు సైతం పెద్దఎత్తున కోచింగ్ సెంటర్లు వెలిశాయి. వీటికి అనుమతులు లేకపోవడంతోపాటు కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తుండగా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది.
గతంలో పలువురు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కానిస్టేబుల్, ఎస్ఐ శిక్షణ ఇచ్చిన అభ్యర్థులు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వలేదని, సిలబస్ పూర్తి చేయలేదని, స్టడీ మెటీరియల్ ఇవ్వలేదని అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో పలు కోచింగ్ సెంటర్ల యజమానులు వాటి స్థానంలో కొత్త పేర్లతో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ప్రారంభించారు. ఇందుకోసం పెద్దఎత్తున ఫీజులు వసూలు చేయడంతోపాటు హాస్టల్స్ సైతం నిర్వహిస్తున్నారు. వీటికి కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలియని విద్యార్థుల తల్లిదండ్రులు రూ.వేలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు.
మహబూబ్నగర్తో పాటు నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తిలోనూ చాలా కోచింగ్ సెంటర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించడం విశేషం. టెట్, డీఎస్సీ, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు వ్యక్తిగత సెలవులు పెట్టుకుని శిక్షణ ఇస్తుండగా.. మరికొంత మంది ఉదయం, సాయంత్రం వేళల్లో కోచింగ్ సెంటర్లను నడిపిస్తున్నారు. సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎలాంటి ప్రైవేటు వ్యాపారాలు చేసేందుకు వీల్లేదు.


