జడ్చర్ల టౌన్: పట్టణంలో ఆదివారం నుంచి జరగబోయే 69వ జాతీయ ఎస్జీఎఫ్ అండర్–17 క్రికెట్ టోర్నీకి సంబంధించిన హెల్ప్డెస్క్ బ్యానర్ను డీఈఓ ప్రవీణ్కుమార్ శుక్రవారం జడ్చర్లలో ఆవిష్కరించారు. ముందుగా ఏర్పాట్లను పరిశీలించిన ఆయన అనంతరం మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వాలని కమిటీలకు సూచించారు. అనంతరం బాలుర పాఠశాలలో భోజన ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. క్యాటరింగ్కు సంబంధించి సౌత్ ఇండియాతో నార్త్ ఇండియా వంటకాలను వడ్డించాలని అలాగే స్వచ్చమైన మంచినీరు అందించాలన్నారు. తర్వాత మినీ స్టేడియంలో క్రీడల ప్రారంభోత్సవానికి సంబంధించిన వేదిక ఏర్పాట్లను పరిశీలించి ఎండల దృష్ట్యా టెంట్లను ఏర్పాటు చేయాలన్నారు. పాల్గొనే జట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి, రిజిస్ట్రేషన్, రవాణాకు సంబంధించి ఎప్పటికపుడు పర్యవేక్షించాలన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి సమస్యలను నివృత్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మంజులాదేవి, పీడీ, పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదా, మోయిన్ పాల్గొన్నారు.


