జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): నిరుద్యోగ యువత ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ‘నేషన ల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్స్రక్షన్’ ద్వారా నిర్వహించిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పేద బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీ, వెనుకబడిన తరగతుల యువతకు ప్రభుత్వం మూడు నెలల పాటు ఉచిత నైపుణ్య అభివృద్ధి శిక్షణ అందిస్తోందన్నారు. నిరుద్యోగ యువతి యువకులు గృహ నిర్మాణం, ఎలక్ట్రికల్ వైరింగ్, ఫ్లంబింగ్, వెల్డింగ్, టైలరింగ్, భూమి సర్వే, లాంటి వివిధ ట్రేడ్లలో ఉచిత నైపుణ్య శిక్షణను పొంది స్వయం ఉపాధితో పాటు వివిధ కంపెనీలలో మంచి ఉద్యోగావకాశాలు పొందవచ్చని చెప్పారు. 2025–26లో జిల్లాలో 800 మంది నిరుద్యోగ యువతి యువకులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ అందించామని, వారిలో 200 మంది ప్లేస్మెంట్ ద్వారా వివిధ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించామమని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్’ సహాయ సంచాలకులు శివశంకర్ తెలిపారు. జిల్లాలో బోయేపల్లి గేటు వద్ద ఉన్న యూత్ శిక్షణ కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, అత్యాధునిక ల్యాబ్లు, పరికరాలున్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లలను అందించారు. కార్యక్రమంలో ఎస్టీ అభివృద్ధి శాఖ అధికారి ఛత్రునాయక్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సునీత, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఖయ్యూం, తదితరులు పాల్గొన్నారు.


