జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీల్లో సమస్యగా మారిన చెత్తను వినియోగించుకునే క్రమంలో ఈనెల 25న జడ్చర్ల మున్సిపాలిటీలో సీడీఎంఏ నుంచి ఒకరోజు వర్క్షాప్ నిర్వహించనున్నారు. వర్క్షాప్లో జడ్చర్ల మున్సిపాలిటీతో పాటు మహబూబ్నగర్, షాద్నగర్, కొత్తూరు, భూత్పూర్, దేవరకద్ర, మక్తల్ మున్సిపాలిటీల నుంచి కమిషనర్లు, శానిటరి ఇన్స్పెక్టర్లు, ఎన్విరాన్మెంట్ ఏఈలు పాల్గొననున్నారు. వర్క్షాప్లో కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సీడీఓ హేమలత హాజరై శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం మున్సిపాలిటీ పరిధిలోని బోయిలకుంట సమీపంలోని మున్సిపల్ 10 శాతం భూమిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం వర్క్షాప్ నిర్వహించే ప్రాంతానికి తడిచెత్తను తరలించారు. మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, శానిటరి ఇన్స్పెక్టర్ నరేష్ ఏర్పాట్లను పరిశీలించారు. మున్సిపాలిటీల్లో సేకరించిన తడిచెత్తను ఎరువుగా ఎలా మార్చాలనే దానిపై పూర్తిస్థాయిలో తర్ఫీదు ఇవ్వనున్నారు. తర్వాత అన్ని మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి తడి, పొడిచెత్తను వేరు వేరుగా స్వీకరించి తడి చెత్త ద్వారా ఎరువుగా మార్చాలని కృషి చేస్తున్నారు. అలా తయారైన ఎరువును మున్సిపాలిటీలోని చెట్లకు వినియోగించటంతో పాటు ఉత్పత్తి ఎక్కువైతే రైతులకు విక్రయించటం ద్వారా మున్సిపాలిటీకి ఆదాయ మార్గాలు సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు.


