మహబూబ్నగర్ క్రైం: కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జనగాం కు చెందిన దినకర్రెడ్డి (55) కుటుంబ సభ్యులు ఐదుగురితో కలిసి దేవరకద్ర నుంచి మహబూబ్నగర్కు వస్తుండగా.. మార్గమధ్యలో ఆల్మదీనా కళాశాల వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో కారు డోర్ తెరుచుకోవడంతో దినకర్రెడ్డి తల రోడ్డుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బంధువులకు సంబంధించిన ఫంక్షన్ కోసం జనగాం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ రెండో ఎస్ఐ భూపాల్రెడ్డి వెల్లడించారు.


