మహబూబ్నగర్ క్రైం: ఆర్టీసీ బస్సు సేవలకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో గురువారం బస్టాండ్ ఆవరణలో బందోబస్తు విధానాన్ని ఎస్పీ పరిశీలించారు. సమ్మె పరిస్థితుల్లో కూడా రవాణా సేవలు నిరంతరంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండ్లలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రైవర్లు తమ విధులు నిర్వహించాలని, ప్రజల రవాణా సౌకర్యాన్ని నిరవధికంగా కొనసాగించేందుకు పోలీస్శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టిందన్నారు. ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బస్సుల ప్రయాణానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించినా, మార్గమధ్యలో బస్సులను నిలిపిన, డ్రైవర్లపై దాడులకు పాల్పడిన అలాంటి చర్యలను చట్టవిరుద్ధంగా పరిగణించి సంబంధిత వ్యక్తులపై నాన్–బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ ఉన్నారు.


