మహబూబ్నగర్ రూరల్/జెడ్పీసెంటర్: దివ్యాంగుల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆత్మగౌరవ గర్జన ప్రారంభమైందని, హామీలు అమలు చేయకపోతే పాలకులకు దివ్యాంగుల శక్తి చూపిస్తామని ఎన్పీఆర్డీ ఇండియా జాతీయ అధ్యక్షుడు తుడుం రాజేందర్ హెచ్చరించారు. జూలై 15న హైదరాబాద్లో లక్ష మందితో నిర్వహించనున్న దివ్యాంగుల ఆత్మగౌరవ బహిరంగసభ చరిత్రాత్మకంగా నిలవనుందని తెలిపారు. జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన జిల్లాస్థాయి సన్నాహక సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు టి.మధుబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు దైనంపల్లి మల్లికార్జున్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త యాదగిరి, స్కైటు రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ షఫీ, ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. నెలకు రూ.6 వేల పింఛన్, జిల్లాల్లో ప్రత్యేక శాఖలు, ఉచిత బస్సు ప్రయాణం, రాజకీయ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయా లని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు మొదటి రోస్టర్ పాయింట్ కేటాయించాలని కోరారు. జూలై 15న జరిగే సభను విజయవంతం చేయడానికి జిల్లా నుంచి వేలాదిగా తరలివచ్చాలని పిలుపునిచ్చారు.


