‘డిండికి కృష్ణా నీటిని తరలిస్త్తే ఉద్యమాలు తప్పవు’ | - | Sakshi
Sakshi News home page

‘డిండికి కృష్ణా నీటిని తరలిస్త్తే ఉద్యమాలు తప్పవు’

Apr 15 2026 8:56 AM | Updated on Apr 15 2026 8:56 AM

కొల్లాపూర్‌ రూరల్‌: పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకుండా కృష్ణానది నీళ్లను డిండికి తీసుకెళ్తే ఉద్యమాలు తప్పవని పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన కమిటీ నాయకులు రాఘవాచారి, రాజేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని ఎల్లూరు శివారులో నిర్మాణంలో ఉన్న పాలమూరు, కేఎల్‌ఐ ప్రాజెక్టులను బృందంతో సందర్శించారు. ఈ సందర్భంగా పంపహౌజ్‌లు, ప్యానల్‌బోర్డు, డెలివరీ పంపులు, నార్లాపూర్‌, ఎల్లూరు రిజర్వాయర్‌ను పరిశీలించారు.అనంతరం కొల్లాపూర్‌లో విలేకరులతో మా ట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి మొదటి ప్యాకేజీలో కృష్ణానది నీళ్లను ఎత్తిపోసేందుకు నాలుగు బహుబలి మోటర్లు సిద్ధంగా ఉన్నా.. ఎందుకు ఎత్తిపోయలేదని ప్రశ్నించారు. మూడోప్యాకేజీలో పెండింగ్‌లో ఉన్న కొంత పనిని పూర్తిచేస్తే దాదాపు 50 టీఎంసీలు ఎత్తిపోసేందుకు అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నా.. పాలమూరుకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరుగుందని ఆరోపించారు. సైనికుడుగా పనిచేసిన ఉత్తమ్‌ కుమా ర్‌రెడ్డి అన్ని ప్రాంతాలను సమానంగా చూడాల్సింది పోయి పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తున్నా రని విమర్శించారు. ఎంజీకేఎల్‌ఐ ప్రాజె క్టు మొత్తం కలిసి 4 టీఎంసీల రిజర్వాయర్లు మాత్రమే ఉంటే డిండి ప్రాజెక్టు ద్వారా 25 టీఎంసీల నీళ్లను తీసుకుపోయేందుకు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రయ త్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. డిండి ప్రాజెక్టు మూలంగా పాలమూరు జిల్లావాసులు కృష్ణానదిపై నీటిహక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. డిండికి గోదావరి నీళ్లను మల్లన్నసాగర్‌ నుంచి తీసుకోవాలని ప్రభుత్వం, మంత్రి ఉత్తమ్‌కమార్‌రెడ్డికి సూచించారు. ప్రాజెక్టుల కోసం ఈ ప్రాంత ప్రజలు భూములను త్యాగం చేశారని.. మళ్లీ ఇప్పుడు ఆయకట్టు లేకుండా మరోసారి రైతులు డిండి ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసేందుకు సిద్ధంగా లేరన్నారు. డిండి ప్రాజెక్టు ఆలోచన విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. వెంటనే పాలమూరు ప్రాజెక్టు పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు ప్రయోజనాల కోసం ప్రతిగ్రామంలో పెండింగ్‌ ప్రాజెక్టు సాధన కమిటీ పర్యటించి కమిటీలు వేసి ఉద్యమాలకు సిద్ధం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఏసేపు, వేణుగోపాల్‌, వెంకటేశ్వర్లు, ఖాదర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement