జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రజలు రోడ్డు భ ద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి శనివారం వరకు నిర్వహించనున్న ‘అరైవ్– ఆలైవ్’ రోడ్డు భద్రత అవగాహన వాల్పోస్టర్లును ఆమె తన చాంబర్లో ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలు రోడ్డు భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తగా మెలగాలని, రోడ్డుపై ప్రయా ణించేటప్పుడు, వాహనాలను నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని అన్నారు. ముఖ్యంగా యువత మద్యం తాగి నడపడం, అధిక వేగంతో వెళ్లడం చేయరాదని, వారి గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకొనే విధంగా జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ప్రతిఏటా రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, ద్విచక్రవాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖాధికారి రఘుకుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ సంధ్య, పోలీసు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జనగణనకు పక్కాగా ఏర్పాట్లు
జనగణనకు అన్నిరకాల ఏర్పాట్లు పక్కాగా చేయాలని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం ఆమె హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జనగణనకు సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎన్యూమరేషన్ సూపర్వైజర్ల నియామకం, హౌస్ లిస్టింగ్ బ్లాక్ల ఏర్పాటు పనులను రెండు రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి మండలానికి చార్జి అధికారులు హౌస్ లిస్టింగ్ బ్లాక్లను త్వరితగతిన రూపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీసీలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, కలెక్టర్ హరిప్రియ, జిల్లా ప్రణాళిక అధికారి రవీందర్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.


