మహబూబ్నగర్ క్రైం: ప్రజలు మధ్యవర్తులు లేకుండా నేరుగా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కో దరఖాస్తును స్వయంగా పరిశీలించి బాధితులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం ఆయా ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
ముగిసిన ‘పది’ పరీక్షలు
● చివరిరోజు 13,301 మంది విద్యార్థుల హాజరు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పదో తరగతి వార్షిక పరీక్షలు ముగిశాయి. చివరిరోజు సోమవారం జరిగిన సోషల్ స్టడీస్ పరీక్ష 60 కేంద్రాల్లో కొనసాగగా.. 13,301 మంది హాజరవగా.. 22 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సుమారు నెలరోజులపాటు కొనసాగిన పరీక్షలు పూర్తవడంతో విద్యార్థులు సంతోషంగా ఇంటిబాట పట్టారు.


