గ్రామస్తులతో మాట్లాడుతున్న ఫారెస్టు అధికారులు
లేగదూడపై దాడి చేస్తున్న చిరుత
మల్దకల్: మండలంలోని నేతువానిపల్లి సమీపంలోని గుట్టల్లోని వ్యవసాయ పొలం వద్ద ఓ లేగదూడపై చిరుత దాడి చేసి చంపిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కొంతకాలంగా గ్రామ సమీపంలోని గుట్టల్లో పాగా వేసిన చిరుత వ్యవసాయ పొలాల వద్ద ఉన్న పశువులపై దాడి చేసి చంపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఫారెస్టు అధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలో దాడి చేసిన జంతువును గుర్తించేందుకు గురువారం రాత్రి ఓ రైతు తన వ్యవసాయ పొలం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మధ్యరాత్రి చిరుత సంచరించే ఘటనలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పాటు లేగదూడపై దాడి చేసి చంపిన దృశ్యం నమోదైంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫారెస్టు అధికారులు ఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. మూడు నెలలుగా పశువులపై దాడి చేసింది చిరుతేనని అధికారులు ధ్రువీకరించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కొంతకాలంగా పశువులపై దాడి చేస్తున్నది చిరుత కాదని, నక్క లేక హైనా అయి ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు అంచనా వేశారు. అయితే సీసీ కెమెరాలో చిరుత సంచారం రికార్డు కావడంతో వెంటనే దానిని బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే రైతులు తమ పశువులను వ్యవసాయ పొలాల వద్ద ఉంచరాదని, పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. కార్యక్రమంలో ఫారెస్టు అధికారులు పర్వేజ్అహ్మద్, ప్రసూన, సిబ్బంది పాల్గొన్నారు.


