మన్ననూర్: అమ్రాబాద్ ఫారెస్టు రేంజ్ పరిధిలోని కొల్లంబీట్ పరిధిలోని అడవిలో శుక్రవారం అగ్ని కీలలు చెలరేగాయి. వేసవి కావడంతో అటవీ ప్రాంతంలో మొత్తంగా ఎండుగడ్డి, ఎండుటాకులు విస్తరించి ఉన్నాయి. ఈక్రమంలో ఎవరైనా నిప్పు రాజేశారో కొన్ని సమయాల్లో వేడికి అగ్నికీలలు చెలరేగుతాయి. ఎలా జరిగిందో కానీ 6–7గంటల పాటు అడవిలో మంటలు చెలరేగి సుమారు 20 హెక్టార్ల విస్తీర్ణంలో అగ్నికి ఆహుతైంది. మంటలు చెలరేగుతున్న సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఫైర్ వాచర్లు, టైగర్ ట్రాకర్లు, ప్రొటెక్షన్ వాచర్లు సుమారు 20మంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొస్తున్నట్లు అటవీశాఖ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారి లంబడోని ఉతార్ సమీప ప్రాంతంలో పొగలు విస్తరించడంతో కొంత సమయంపాటు రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.


