అలంపూర్: సమాజంలో మహిళల హక్కుల సాధనకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం(ఐద్వా) కృషి చేస్తుందని ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి అన్నారు. పట్టణంలో ఆదివారం ఐద్వా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లడుతూ.. సమాజంలో మహిళలపై దాడులు, వివక్ష కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మనువాద రాజకీయాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా సమాజంలో మహిళను రెండో పోరురాలిగానే చూస్తున్నారన్నారు. సమాజంలో మహిళాకు సమానహక్కులు లేవన్నారు. ప్రేమ, కులం పేరుతో మహిళలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. పోర్న్ సైట్లని నిషేధించడంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. జిల్లా అధ్యక్షరాలు ఏమేలమ్మ, కార్యదర్శి నర్మద మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల సమస్యలపై నిరంతరం పోరాడేది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంమన్నారు. ఐద్వాకు పెద్ద సంఖ్యలో సభ్యులుగా చేరాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో విసృతంగా సభ్యత్వ నమోదు కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మహిళకు రూ.2500, నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యలపై సర్వేలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రాధమ్మ, సమీరా, సుజాత, మాధవి పాల్గొన్నారు.


