అధ్వాన స్థితిలో ప్రధాన, అంతర్గత రహదారులు
● ఎక్కడబడితే అక్కడ అడుగు లోతు గుంతలు పడిన వైనం
● పట్టించుకోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు
● వాహనదారులు, పాదచారులకు తప్పని ఇబ్బందులు
–8లో u
ఎక్కడెక్కడ అంటే..?
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో ప్రధాన, అంతర్గత రోడ్లు చాలా చోట్ల అధ్వాన స్థితికి చేరుకున్నాయి. ఎక్కడబడితే అక్కడ అడుగు లోతు గుంతలు పడినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఆయా గల్లీలలో మిషన్ భగీరథ పథకం పైపులైన్ల కోసం రోడ్లను అడ్డంగా తవ్వి సరిగా పూడ్చకుండా అలాగే వదిలేశారు. ఇన్నేళ్లయినా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గాని ఇంటింటికీ నల్లా కనెక్షన్ తీసుకున్న యజమానులు గాని మరమ్మతు చేసిన దాఖలాలు లేవు. మనకెందుకులే అని ఎవరికి వారు వదిలేయడంతో పాదచారులు నడవడానికి, అలాగే వాహనదారుల రాకపోకలకు తరచూ అంతరాయం కలుగుతోంది. బైక్లు మొదలుకుని భారీ వాహనాలు ఆయా గుంతల వద్దకు చేరుకోగానే ఆగి నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది.
క్లాక్టవర్ చుట్టూ నలుదిక్కులా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి కొన్ని నెలలు గడుస్తున్నాయి. క్లాక్ టవర్ నుంచి అశోక్ టాకీస్ చౌరస్తా వరకు పలుచోట్ల బీటీ, సీసీ పగిలిపోయింది. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట, సమీపంలోని పెద్ద బ్రిడ్జి వద్ద కంకర లేచిపోయింది.
ఎన్హెచ్–167పై షాషాబ్గుట్టకు వెళ్లే మలుపు వద్ద, అశోక్ టాకీస్ చౌరస్తాలోని బాలగంగాధర్ తిలక్ విగ్రహం ఎదుట, మోడ్రన్ రైతుబజార్కు ఎదురుగా సుమారు ఏడాది క్రితం మిషన్ భగీరథ పథకం మెయిన్ పైపులైన్కు భారీ లీకేజీలు ఏర్పడటంతో మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు బాగు చేశారు. అయితే ఈ మూడు చోట్ల బీటీ రోడ్డు లెవలింగ్నుమరిచిపోయారు. ఎక్కడికక్కడ కంకర తేలి నడవడానికి సైతం వీలు లేని పరిస్థితి నెలకొంది.
క్లాక్టవర్ నుంచి రాంమందిర్చౌరస్తా వరకు పదుల సంఖ్యలో బీటీ దెబ్బతింది. ఈ మార్గంలో ఇరువైపులా వివిధ వ్యాపార దుకాణాలు ఎప్పుడూ జనంతో కిక్కిరిసి ఉంటాయి. గతుకుల రోడ్డు కారణంగా వాహనాలు వెళ్లడానికి, పాదచారులు నడవడానికి నరకయాతన పడుతున్నారు.
క్లాక్టవర్ నుంచి మార్కెట్ రోడ్డు, పాత బస్టాండు మొదలుకుని కోయిల్కొండ ఎక్స్రోడ్డు వరకు చాలా చోట్ల గుంతలు పడ్డాయి.
పాత బస్టాండు నుంచి తెలంగాణచౌరస్తా వరకు మూడు చోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.
తెలంగాణ చౌరస్తా నుంచి బోయపల్లిగేట్ వరకు, సుభాష్నగర్ నుంచి ఎర్రసత్యం చౌరస్తా వరకు, రెడ్క్రాస్ బిల్డింగ్కు ఎదురుగా, న్యూటౌన్ చౌరస్తా నుంచి స్టేషన్ రోడ్డు వరకు, జీజీహెచ్కు ఎదురుగా ఉన్న రెండు గల్లీలలో పలుచోట్ల సీసీ, బీటీ దెబ్బతిని గుంతలు పడ్డాయి.
మెట్టుగడ్డ నుంచి టీచర్స్కాలనీ, మర్లు మీదుగా ఎస్ఆర్నగర్ వరకు అడుగడుగునా గుంతలు పడ్డాయి. ఇక 60 డివిజన్ల పరిధిలోని వీధి రోడ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
తప్పక బాగు చేయిస్తాం
నగరంలోని ప్రధాన, అంతర్గత రహదారులపై వివిధ చోట్ల బీటీ, సీసీ దెబ్బతిని గుంతలు ఏర్పడిన విషయం వాస్తవమే. త్వరలోనే వీటన్నింటిని ఒకసారి పరిశీలించి ఎక్కడ అవసరమైతే అక్కడ తప్పక బాగు చేయిస్తాం.
– పి.రామాంజులరెడ్డి, కమిషనర్, మహబూబ్నగర్ కార్పొరేషన్


