మహమ్మదాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పనుల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ అధికారులకు సూచించారు. ఆదివారం మహమ్మదాబాద్, చిన్నాయపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. గ్రామ పంచాయతీల్లోని నర్సరీలు, సెగ్రిగేషన్ షెడ్లు, లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇంకా ప్రారంభంకాని ఇళ్ల పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


