● పాలమూరు క్యాన్సర్ ఆస్పత్రివైద్యనిపుణుడు రాజ్కుమార్
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, మొదటి దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా సులువుగా తగ్గించ్చవచ్చని పాలమూరు క్యాన్సర్ ఆస్పత్రి సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బిల్లకంటి రాజ్కుమార్, మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కె రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ కృష్ణకిషోర్ పేర్కొన్నారు. నగరంలోని పాలమూరు క్యాన్సర్ ఆస్పత్రిలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. క్యాన్సర్ నానాటికి పెరుగుతున్న క్రమంలో పేదలకు స్థానికంగా ఖరీదైన క్యాన్సర్ వైద్యం అందుబాటులో ఉండాలని 2022లో ఆస్పత్రి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆస్పత్రి ఏర్పాటు చేసిన నాటినుంచి ఇప్పటి వరకు వెయ్యి వరకు సర్జరీలు, 5వేల మందికి కీమో థెరపీ చేసినట్లు పేర్కొన్నారు. ఊపిరితిత్తులు, లివర్, మూత్రాయం, పాన్క్రీస్ క్యాన్సర్కు మొదటిసారిగా స్థానికంగా వైద్యం చేసినట్లు వెల్లడించారు. క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా, ఒత్తిడి, కెమికల్స్ కూడిన ఆహారం, ఊబకాయం, మద్యం, సిగరేట్ గుట్కా వంటి అలవాట్లతో వచ్చే అవకాశం ఉంటుందని సూచించారు. జిల్లాలో క్యాన్సర్పై అవగాహన లేకపోవడంతో చాలామంది ఆలస్యంగా గుర్తించి ఆ తర్వాత వైద్యులను సంప్రదిస్తున్నారని అప్పటికే ఆలస్యం చేస్తున్నారని, అలా కాకుండా లక్షణాలు కన్పిస్తే వెంటనే పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. మొదటి దశలో వస్తే తప్పక రోగం నయం చేయడానికి అధికంగా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఒకవైపు వైద్యసేవలతోపాటు ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక సదస్సులు, ర్యాలీలు నిర్వహించి పల్లెల్లో విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, కార్భశయ ముఖద్వారా క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నాయని, చిన్నారుల నుంచి పెద్దలు ఈ ప్రాణాంతకమైన వ్యాధిబారినపడుతున్నట్లు వెల్లడించారు.
మహిళల్లో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్లు
ప్రజల్లో ఈ వ్యాధిపై సరైన అవగాహన ఉండడం లేదన్నారు. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లు పంజా విసురుతున్నాయని తెలిపారు. వ్యాధిసోకుతున్న వారిలో గ్రామీణ ప్రాంతాలవారే అధికంగా ఉంటున్నారని, గతంలో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ 50ఏళ్లపైబడి మోనోపాజ్ దశలో ఉన్నవారికి మాత్రమే వచ్చేదని పేర్కొన్నారు. ప్రస్తుతం యుక్త వయస్సు వారిలో ఇది వస్తున్నట్లు తేలిందని, హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ) ద్వారా ఈ వ్యాధి సోకుతుందని, బాల్యవివాహాలు, సుఖవ్యాధులు, పౌష్టికాహార లోపం ఎక్కువమంది పిల్లలను కనటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలో 90శాతానికిపైగా రొమ్ము క్యాన్సర్ బాధితులు వ్యాధి ముదిరిన తర్వాతే వైద్యుల వద్దకు వెళ్తున్నారని తెలిపారు. చిన్నచిన్న గడ్డలను గుర్తించినా నిర్లక్ష్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు.


