జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 165 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలు శ్రద్ధగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి ఎండార్స్ చేస్తూ ఫిర్యాదులు పరిష్కారం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులు, ప్రజావాణిలో కలెక్టర్కు అందిన పెండింగ్ ఫిర్యాదులు శాఖల వారీగా సమీక్షించారు. మూడు నెలలకు మించి పెండింగ్లో నున్న ఫిర్యాదులు అన్ని వెంటనే పరిష్కరించాలని, గత ప్రజావాణిలో కూడా కలెక్టర్ సమీక్షించి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నరసింహులు, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
● ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజు కార్యక్రమానికి చెందిన హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన హెల్ప్లైన్ నంబర్స్ పోస్టర్స్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారి జరీనాబేగం, తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలి
స్టేషన్ మహబూబ్నగర్: సమాజంలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మహిళలు ధైర్యంగా ముందుగా సాగాలని కలెక్టర్ ఖుష్భూ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రం మదీనా మసీద్ప్రాంతంలో గాలిబ్ హాల్లో మెరాజ్ ఎడ్యుకేషనల్, వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఐదురోజుల ‘సమాత్–ఏ–ఖురాన్ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కట్నం, బాల్య వివాహాలు, బాలికల నిరక్షరాస్యత వంటి సమస్యలు ఇంకా సమాజంలో ఉన్నాయని, మహిళలు విద్యను సాధించి ఈ సమస్యలను అధిగమించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఒక కుటుంబంలో మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా వెలుగొందుతుందన్నారు. రంజాన్ మాసం ఐక్యత, సోదరభావం, శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. అనంతరం సమాత్–ఏ–ఖురాన్ కార్యక్రమంలో భాగంగా ఖురాన్ పఠనం విజయవంతంగా పూర్తి చేసిన వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మెరాజ్ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ సొసైటీ స్థాపకురాలు అయేషా తఖీయోద్దీన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హాదీ, జేబా, ఫర్హతుల్లా, షఫియోద్దీన్ పాల్గొన్నారు.


