● జిల్లాలో పీహెచ్సీలలో కొనసాగుతున్న ఆరోగ్య వైద్య శిబిరాలు
● స్థానికంగా హైక్వాలిటీ ట్యాబ్లెట్స్ కొరత
పాలమూరు: జిల్లావ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి కింద హెల్త్ మిషన్–100 పేరుతో ఈనెల 6 నుంచి వంద రోజుల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పీహెచ్సీ స్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని వయసుల వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సోమవారం నాటికి 9 పీహెచ్సీలలో ఆరోగ్య వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మొత్తం 3,599 మందికి స్క్రీనింగ్ చేశారు. పలు విభాగాల వైద్య నిపుణులు చేస్తున్న పరీక్షల్లో అధికంగా గైనిక్లో రక్తహీనత, రుతుస్రావం, తెల్లబట్ట, కంటిచూపు సమస్యలో శుక్లాల ఇబ్బందులు, చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలు బహిర్గతం అవుతున్నాయి. దంత సమస్యలు సైతం వైద్యుల దృష్టికి వస్తున్నాయి.
మందుల కొరత
ఆరోగ్య శిబిరాల్లో పలు రకాల విభాగాల వైద్య నిపుణులు ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన ట్యాబెలెట్స్, ఇంజక్షన్స్ రాసిన క్రమంలో ఆయా పీహెచ్సీలలో అలాంటి మందులు స్థానికంగా ఉండటం లేదని తెలుస్తోంది. హైక్వాలిటీ ట్యాబ్లెట్స్ ఇచ్చిన క్రమంలో పీహెచ్సీలలో సాధారణ మాత్రలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న డ్రగ్స్తోనే సరిపెడుతున్నట్లు తెలుస్తోంది.


