● సంచలన తీర్పు వెలువరించినజిల్లా కోర్డు
● కన్నకూతురి కోసం భర్తపై న్యాయపోరాటం
వనపర్తి: సభ్యసమాజం తలదించుకునే.. రెండోసారి గుర్తుచేసుకునేందుకు సిగ్గుగా అనిపించే దురదృష్టకరమైన ఘటన కన్నకుమార్తైపె లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి కేసులో బుధవారం జిల్లా జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. భర్తే కుమార్తైపె అఘాయిత్యానికి పాల్పడడంతో కీచకుడిని ఎదిరించి ఆ తల్లి చేసిన న్యాయపోరాటం సఫలీకృతమైంది. ఇలాంటి ఘటనలు సమాజంలో మరోసారి పునరావృత్తం కావొద్దంటూ.. బుధవారం వనపర్తి జిల్లా కోర్టులో న్యాయమూర్తి ఎంఆర్ సునీత నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదుతో పాటు రూ.20 వేల జరిమానా విధించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి ఈ తీర్పు గట్టి హెచ్చరికలు చేసినట్లు అవుతుందని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే..
వనపర్తి జిల్లా పానగల్ మండలానికి చెందిన వల్లెపోలు కురుమయ్య తన కుమార్తెకు పుస్తకాలు ఇప్పిస్తానని నమ్మించి పెబ్బేరు మండలంలోని రంగాపూర్ శివారులోని జూరాల కాల్వ వద్దకు తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు పోలీసులు విచారణ చేశారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులు కోర్టు ముందు ఉంచడంతో.. వాదనలు విన్న న్యాయస్థానం బుధవారం తుది తీర్పును వెలువరించింది.
భర్తపై న్యాయపోరాటం
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కుమార్తైపె మృగంలా అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని తల్లికి చెప్పేందుకు బాధితురాలికి నాలుగురోజుల సమయం పట్టింది. విషయం తెలుసుకున్న వెంటనే భరించలేని తల్లికి న్యాయపోరాటానికి సిద్ధమై.. పెబ్బేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలం తీసుకొని నిందితుడిని రిమాండ్కు తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టిన ఆధారాల ప్రకారం జిల్లా జడ్జి తీర్పునిచ్చినట్లు ఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటానికి కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు డ్యూటీ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


