అచ్చంపేట రూరల్: రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామ సర్పంచు బొజ్జ గీత కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్వహించిన మహిళా జాతీయ సదస్సులో నల్లమల ప్రాంతానికి చెందిన మహిళా సర్పంచు బొజ్జ గీత పాల్గొన్నారు. జాతీయ సదస్సులో రాష్ట్రంలో నుంచి 16 మంది మహిళా సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయగా... అందులో నాగర్కర్నూల్ జిల్లా నుంచి ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన బొజ్జ గీత కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సదస్సులో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు కేటాయించాలని కోరారు. ప్రజాప్రతినిధులుగా మహిళలు ఉన్న ప్రాంతాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నల్లమల ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర నిధులు కేటాయించాలని కోరారు. నిధుల ఆధారంగానే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. తన గ్రామ పంచాయతీలో కొన్ని సమస్యలు ఉన్నాయని, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సదస్సులో నాగర్కర్నూల్ జిల్లా నుంచి పాల్గొనడానికి అవకాశం కల్పించిన కలెక్టర్, డీపీఓ, రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


