ఉండవెల్లి: ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, ఉచితంగా ఇసుక అందించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని కంచుపాడులో సురవరం విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ, మహిళలకు రూ.2.500, ఆసరా పింఛన్ పెంపు, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం అందించడం గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. కేవలం రెండుసార్లే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేశారన్నారు. నడిగడ్డలో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఒక ఎత్తిపోతల పథకానికి సురవరం సుధాకర్రెడ్డి పేరు పెడతామని హామీ ఇచ్చిన అమలు కాలేదని తెలిపారు. కంచుపాడు హత్య కేసులో నిందితులను విడిచిపెట్టి, అమాయకుల శిక్షించిన పోలీసులపై చర్యలను తీసుకోవాలిన ఉన్నతాధికారులను కోరారు. అనంతరం తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని మీటర్ రీడర్లు ఎమ్మెల్సీకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సురవరం విజయలక్ష్మి, సీపీఐ నాయకులు శ్రీరాములు, కపిల్, నాగార్జున, రవి తదితరులు పాల్గొన్నారు.
మహిళలు రాజకీయాల్లో రాణించాలి
జాతీయ, రాష్ట్ర స్థాయిలో మహిళలు రాజకీయంగా ఎదిగి చట్టసభల్లో తమ గళం వినిపించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో రాణించిన మహిళలకు మెమొంటోలు అందించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావు మాట్లాడుతూ.. సమాజంలో సీ్త్ర, పురుషులు సమానమే అని, అందరికీ సమాన అవకాలు కల్పించాలన్నారు. స్వామి రామానంద తీర్థ చైర్మన్ కిషోర్రెడ్డి మాట్లాడుతూ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధితో కూడిన అవకాశాలు కల్పిస్తామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మహిళా సర్పంచులను సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, ఎంఈఓ సువార్తమ్మ, కపిల్, శ్రీరాములు, పోలీస్ సిబ్బంది, టీచర్లు పాల్గొన్నారు.


