● 3 హిటాచీలు, 2 టిప్పర్ల పట్టివేత
మరికల్: కోయిల్సాగర్ వాగులో అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్న మాఫియాపై హైదరాబాద్ విజిలెన్స్ అధికారుల బృందం మంగళవారం తెల్లవారుజామున మెరుపుదాడులు చేసింది. ఈ క్రమంలో కోయిల్సాగర్ వాగులో ఉన్న 3 హిటాచీలు, 2 టిప్పర్లను పట్టుకున్నారు. పట్టుబడిన హిటాచీలు, టిప్పర్లను మరికల్ పోలీస్స్టేషన్కు తరలించారు. కోయిల్సాగర్ వాగులో అధికారుల అనుమతి లేకుండా ఏడాది నుంచి రాత్రి సమయంలో ధన్వాడ మండలం గోటూర్ నుంచి మరికల్ మండలం రాకొండ వరకు వాగులోని ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఒక టిప్పర్ ఇసుక బయటకు వెళ్తే రూ.35 వేల చొప్పున విక్రయిస్తున్నారు. అయితే ఇసుక అక్రమ రవాణాపై జిల్లా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో ఈ విషయాన్ని కొందరు హైదరాబాద్ విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విజిలెన్స్ అధికారుల బృందం అర్ధరాత్రి నుంచి గోటూర్, కొండాపూర్, పూసల్పహాడ్, రాకొండ ఇసుక రీచ్లపై మెరుపుదాడి చేయగా రాకొండ రీచ్లో 3 హిటాచీలు, 2 టిప్పర్లు పట్టుబడ్డాయి. ఇందుకు కారణమైన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ భగవంతురెడ్డి, ఎస్ఐ రాము తెలిపారు.


