మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధీనంలో పనిచేస్తున్న అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కోడి గుడ్లు ముఖ్యమైన పోషకాహారంగా అందిస్తున్నారు. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన గుడ్లు సమయానికి సరఫరా కావాల్సి ఉంది. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని తెలుస్తోంది. అధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా గుడ్ల సరఫరా చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు తక్కువగా రావడం, మరికొన్ని చోట్ల నాణ్యత లేని గుడ్లు రావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అలాగే 45–50 గ్రాముల బరువున్న గుడ్లకు బదులుగా 35 గ్రాముల బరువున్నవే సరఫరా చేస్తున్నారు. దీనికి ప్రధానంగా అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, సూపర్వైజర్లు, ప్రాజెక్టు అధికారులు సరైన సమన్వయం లేకుండా వ్యవహరించడం వల్లే పరిస్థితి మరింత ఇంతలా దిగజారిందని స్థానికులు చెబుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల అస్తవ్యస్త నిర్వహణపై ఉన్నతాధికారులు దృష్టిసారించి.. పటిష్టపరచాలని కోరుతున్నారు.


