● మాటల గారడీ తప్పా రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం
● ఏప్రిల్ 9 నుంచి 24 వరకుసంసద్ ఖేల్ మహోత్సవం
పాలమూరు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ కాదని కేవలం యాక్టింగ్ ప్లాన్ మాత్రమేనని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలనను పట్టించుకోకునే దిక్కు లేదని, మాటల గారడీ తప్ప ప్రగతి ప్రణాళిక అనేది ఒక పెద్ద మోసం అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. నిధులు ఇవ్వకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుందని దీనికి సీఎం జవాబు చెప్పాలన్నారు. హామీలు నెరవేర్చకపోవడంతో గ్రామాల్లో తిరగలేక ఎమ్మెల్యేలు ముఖాలు చాటేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా ప్రణాళికల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం కింద పార్లమెంట్, నియోజకవర్గ పరిధిలో యువతను క్రీడల పట్ల ప్రోత్సహించడానికి క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కల్గిన క్రీడకారులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ ఇచ్చే విధంగా మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఏప్రిల్ 9నుంచి 24వరకు మండల స్థాయి, నియోజకవర్గ, పార్లమెంట్ స్థాయిలో క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఈ నాలుగు క్రీడలను ఆడించడం జరుగుతుందన్నారు. ఒక క్యూఆర్ కోడ్ను ప్రతి ఒక్క మండలానికి ఇవ్వడం జరుగుతుందని దీంట్లో క్రీడాకారులు తమ వివరాలను మార్చి 9 నుంచి 24 వరకు మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 16 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు ఉన్న వారు రిజిస్ట్రేషన్ చేసుకొని క్రీడల్లో పాల్గొనవచ్చన్నారు.
కష్టపడితే విజయం తధ్యం
ప్రతి మహిళ లక్ష్యం కోసం కష్టాన్ని సైతం ఇష్టంగా చేసుకొని ముందుకుసాగితే విజయం వరిస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీరెడ్డి ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మహిళలు నిరాశ చెందకుండా ముందుకుసాగాలన్నారు. బీజేపీలో మహిళలకు మంచి ప్రాధన్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మహిళనేతలు పద్మజారెడ్డి, జయశ్రీ, బాలిశ్వరమ్మ, మహిళ కార్పొరేటర్లు జ్యోతి, శ్రీలేఖ, సువర్ణ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.


