జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని వెంకటపతిరావునగర్ కాలనీలోని రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. చోరీలో 7 తులాల బంగారం, రూ.65 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాలనీలోని ఒకే భవనంలో సరస్వతి, మరియమ్మలు నివాసం ఉంటున్నారు. మరియమ్మ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి డ్యూటికి వెళ్లి శనివారం ఉదయం వచ్చి చూడగా ఇంటి తాళం విరగగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా చిందరవందర చేసి ఉండటంతో దొంగలు పడ్డారని గుర్తించి 6 తులాల బంగారు నగలు, కొన్ని వెండి ఆభరణాలతో పాటు రూ.15వేల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించింది లబోదిబోమంది. ఇదే భవనంలో ఉంటున్న సరస్వతి రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లింది. ఆమె ఇంటి తాళం కూడా విరగ్గొట్టి తులం బంగారంతోపాటు రూ.50వేల నగదును ఎత్తుకెళ్లారు. ఇద్దరి మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత వారం చైన్స్నాచింగ్ కేసును రోజుల్లోనే చేధించిన పోలీసులకు వరస దొంగతనాలు సవాల్గా మారాయి. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దుండగులు చోరీకి యత్నిస్తుండటంతో ఎవరైనా ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వస్తే ఇంటిపక్కన వారికి సమాచారం ఇవ్వాలని, ఎక్కువ రోజులు వెళ్లాల్సి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని సీఐ కమలాకర్ పేర్కొన్నారు.
7 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు


