ఆస్పత్రిని శుభ్రంగా పెట్టుకోలేరా?
● పారిశుద్ధ్య లోపంపై అధికారుల నిలదీత
● ఎలక్ట్రికల్ పనుల పెండింగ్పై ఆగ్రహం
● జనరల్ ఆస్పత్రి నిర్వహణపై
కలెక్టర్ విజయేందిర అసంతృప్తి
పాలమూరు: ‘కొన్ని గదుల్లో పడకలు కుప్పలుగా ఉండటంతోపాటు ఏడాది కాలంగా మరమ్మతు పెండింగ్లో ఉండటం ఏమిటి.. ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు, టాయిలెట్స్ ఎందుకు మరమ్మతు చేయలే దు.. ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారు.. ఆస్పత్రి ఆవరణలో ఎటు చూ సిన పాడైన కుర్చీలు, చెత్తే కనిపిస్తుంది.. ఎలక్ట్రికల్ గది పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండటం ఏమిటి.. ఆస్పత్రిలోని ప్రతి మూలను శుభ్రంగా ఉంచుకోలేరా’ అంటూ కలెక్టర్ విజయేందిర వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె నగరంలోని జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా క్యాజువాలిటీ, మాతాశిశు విభాగం, ఐసీయూ విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. క్యాజువాలిటీలో ఒకే బెడ్పై ఇద్దరు రోగులు పడుకోవడం గమనించిన కలెక్టర్ వేర్వేరుగా ఎందుకు ఇవ్వలేదని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. క్యాజువాలిటీలో 24 గంటలు ఎంత మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. ఆ తర్వాత అర్థో విభాగం పరిశీలించి రోజుకు ఎన్ని సర్జరీలు చేస్తున్నారని అడగగా.. 3 నుంచి 5 చేస్తున్న ట్లు సిబ్బంది వెల్లడించారు. మోకాలి సంధి మార్పిడి సర్జరీ చేశారా అని అడగగా ఇప్పటి వరకు ఒకటే చేసినట్లు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జనరల్ ఆస్పత్రికిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా 18 టాయిలెట్స్ మరమ్మతులో ఉన్నాయని, 17 ప్రత్యేక గదులు మరమ్మతు చేయాల్సి ఉండగా.. నిధుల కొరత కారణంగా పెండింగ్లో ఉంచినట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఎలక్ట్రికల్, ప్లంబింగ్, డ్రెయినేజీ పనులను పూర్తి చేసి వచ్చే వారంలోగా స్పెషల్ రూంలను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఇన్చార్జి సూపరింటెండెంట్ మాధవి, డాక్టర్ సునీల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


