క్యాంపుల్లో విభిన్న స్వరాలు
● పార్టీ పెద్దల దృష్టికి గెలిచిన అభ్యర్థుల ‘డిమాండ్లు’
● ఎన్నికల్లో పెద్దమొత్తంలో
ఖర్చు చేశామని వెల్లడి
● మేయర్, చైర్మన్ అభ్యర్థుల
నుంచి ‘ప్యాకేజీ’ కి ఆశలు
పాలమూరు: ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీలతోపాటు మహబూబ్నగర్ కార్పొరేషన్లో జరుగుతున్న క్యాంపు రాజకీయ శిబిరాల్లో పలు రకాల డిమాండ్లు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు మిగతా మున్సిపాలిటీల పీఠాలు చేజిక్కించుకొనేందుకు అధికార పార్టీ ప్రత్యేక దృష్టిసారించింది. ఇతర పార్టీల నుంచి గెలిచిన సభ్యులతోపాటు స్వతంత్రులను తమవైపు తిప్పుకొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. హంగ్ ఏర్పడిన స్థానాలపై దృష్టిపెట్టిన బీఆర్ఎస్ సైతం ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది.
పాలమూరులో ప్రత్యేకం..
ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కంటే పాలమూరు రాజకీయం భిన్నంగా ఉంది. ఇక్కడ అధికార పార్టీ నుంచి 29 మంది కార్పొరేటర్లతోపాటు నలుగురు స్వతంత్రులను క్యాంపు శిబిరాలకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఒక స్వతంత్ర అభ్యర్థి అధికార పార్టీకి మద్దతు ఇవ్వడానికి షరతు విధించినట్లు సమాచారం. తన డివిజన్లో కోఆప్షన్ సభ్యుడిగా ఎవరికి అవకాశం ఇవ్వరాదని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాబోయే మేయర్ కార్పొరేటర్లకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, స్వతంత్రులకు రూ.10 లక్షలకుపైగా ప్యాకేజీ ఇవ్వాలనే డిమాండ్లు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అధిక మొత్తంలో ఖర్చు చేశామని, ఇందుకోసం ప్యాకేజీలు కావాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.
● భూత్పూర్ మున్సిపాలిటీలో అధికార పార్టీకి అధిక మెజార్టీ ఉండగా, దేవరకద్ర మున్సిపాలిటీలో ఒక స్వతంత్ర అభ్యర్థి అధికార పార్టీకి మద్దతు ఇవ్వగా, బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన అభ్యర్థి సైతం ఒకరు కాంగ్రెస్లో చేరారు. దీంతో సంఖ్యాబలం పెరిగి నేరుగా చైర్మన్ పీఠం కై వసం చేసుకునే అవకాశం లభించింది.
● గద్వాలలో చైర్మన్ పీఠం కోసం 16 మంది కౌన్సిలర్లు కావాల్సి ఉండగా ఎంఐఎం అభ్యర్థి ఒకరు వైస్చైర్మన్ ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు ఎన్నికల ఖర్చు అధికంగా అయ్యిందని అధిక మొత్తంలో ప్యాకేజీ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
● నారాయణపేటలో ముగ్గురు అభ్యర్థులు చైర్మన్ రేస్లో ఉండగా.. ఇందులో ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తే.. మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు అధిక మొత్తంలో సమర్పించుకోవాలనే చర్చ నడుస్తోంది.
● అమరచింతలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సయోధ్య కుదిరినా.. తొలి చైర్మన్ ఎవరిని చేయాలనే మంతనాలు జోరుగా నడుస్తున్నాయి.
● పెబ్బేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్న కూడా పలు రకాల డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుకు దరఖాస్తుకు చేసుకున్నట్లు తెలుస్తోంది.
క్యాంపుల్లో విభిన్న స్వరాలు


