మూడింట పైచేయి..
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. జిల్లాలో ఎన్నికలు జరిగిన మూడు మున్సిపాలిటీ చైర్మన్ పీఠాలను కై వసం చేసుకుంది. నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అత్యధిక వార్డు స్థానాల్లో గెలుపొందగా.. మూడు చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కనీసం పోటీ ఇవ్వలేకపోయాయి. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అత్యధికంగా 6 వార్డు స్థానాలు దక్కించుకోగా.. కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో 3 స్థానాలకే పరిమితమైంది. కల్వకుర్తిలో బీఆర్ఎస్ కన్నా బీజేపీ 5 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.
● జిల్లాలోని మూడు
మున్సిపాలిటీ
చైర్మన్ పీఠాలు కాంగ్రెస్కే..
● నాగర్కర్నూల్లో 6
స్థానాలు దక్కించుకున్న బీఆర్ఎస్
● కల్వకుర్తిలో రెండో స్థానంలో
బీజేపీ, మూడో స్థానానికి కారు పార్టీ
జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్గా పోటీచేసిన వారిలో ఒకరు విజయం సాధించగలిగారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో 8వ వార్డు నుంచి రెబల్గా పోటీచేసిన లలిత గెలుపొందారు. సమీప అభ్యర్థి బీజేపీకి చెందిన హైమావతిపై ఆమె 16 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ వార్డులో కాంగ్రెస్ తరపున టికెట్ కోసం లలిత ప్రయత్నించగా చివరికి భంగపాటు ఎదురైంది. రెబల్గా ఎన్నికల బరిలో దిగగా విజయం వరించింది. ఈ వార్డులో బీజేపీ రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమవడం గమనార్హం.


