కల్యాణం.. కమనీయం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ క్షేత్రంలో గురువారం శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పౌర్ణమిని పురస్కరించుకొని శోభాయమానంగా అలంకరించిన పల్లకిలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల నడుమ స్వామి వారి కల్యాణ వేడుక జరిపారు. అశేష భక్తజనావళి తిలకిస్తుండగా జీలకర్ర బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమాలను కనులపండువగా నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి దంపతులను మళ్లీ పల్లకీలో గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు.


