
జూరాలకు నిలకడగా వరద
● ప్రాజెక్టుకు 85 వేలక్యూసెక్కుల ఇన్ఫ్లో
● 5గేట్ల ద్వారా శ్రీశైలానికి81వేల క్యూసెక్కుల విడుదల
గద్వాల: జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలతో వరదనీరు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పట్టికీ నిలకడగా కొనసాగుతుంది. బుధవారం ప్రాజెక్టులోకి 85,000 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతుండగా 5గేట్లు ఎత్తి 81,804 క్యూసెక్కులను దిగువనున్న శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రానికి 44,310 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657టీఎంసీలు (1044.488అడుగులు)కాగా ప్రస్తుతం 9.255టీఎంసీల నీటిని నిల్వ చేశారు. సాగునీటి ప్రాజెక్టులైన నెట్టెంపాడు, భీమా లిఫ్ట్–1, 2, కోయిల్సాగర్, ఆర్డీఎస్, సమాంతర కాల్వలకు నీటిని నిలిపి వేశారు. జూరాల ఎడమ కాల్వకు 1030క్యూసెక్కులు, కుడికాల్వకు 600క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సుంకేసులకు స్వల్పంగా ఇన్ఫ్లో
రాజోళి: సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. బుధవారం ఎగువ నుంచి 11,250 క్యూసెక్కులు ఇన్ఫ్లో రాగా.. ఒక గేటును మీటర్ మేర మరో గేటును అరమీటర్ మేర తెరిచి 6,710 క్యూసెక్కులను వదిలినట్లు ఆయన తెలిపారు. కేసీ కెనాల్కు 2,445 క్యూసెక్కులు వదలడంతో డ్యాం నుంచి మొత్తం 9,155 క్యూసెక్కులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
నిర్వీరామంగా విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు బుధవారం 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 393.855 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 381.838 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 775.693 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు.
శ్రీశైలం గేట్లు మూసివేత
దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ఆనకట్ట వద్ద ఎత్తిన ఆరు గేట్లను బుధవారం మూసివేశారు. జూరాలలో స్పిల్వే ద్వారా 35,794, విద్యుదుత్పత్తి చేస్తూ 44,310, సుంకేసుల నుంచి 6,710, హంద్రీ నుంచి 250 మొత్తం 87,064 క్యూసెక్కుల వదర శ్రీశైలం జలాశయానికి వస్తున్నది. శ్రీశైలంలో భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,833 మొత్తం 66,148 క్యూసెక్కుల నీళ్లను సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.4 అడుగుల వద్ద 212.4385 టీఎంసీల నిల్వ ఉంది. గత 24గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5వేలు, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,830, ఎంజీకేఎల్ఐకి 1,390 క్యూసెక్కులను విడుదల చేశారు. భూగర్భకేంద్రంలో 17.097 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 15.304 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.

జూరాలకు నిలకడగా వరద