
పోలీసుల అదుపులో ‘ఘరానా దొంగ’
గండేడ్: గండేడ్ మండలంలో ఘరానా మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని రెడ్డిపల్లికి చెందిన ఘరానా దొంగ బాగోతంపై ‘సాక్షిశ్రీలో వరుసగా ఈ నెల 5న ‘గండేడ్లో ఘరానా దొంగ’, 6న ‘లీలలు చూడతరమా’, 7న ‘కలకలం.. కలవరం’ శీర్షికన వెలువడిన కథనాలు సంచలనం సృష్టించాయి. ఆధార్, రేషన్ కార్డుల మార్ఫింగ్తో మాయచేసి.. బతికున్న వారి పేరిట తప్పుడు డెత్ సర్టిఫికెట్లతో ఇన్సూరెన్స్ సొమ్ము, భూమి లేకున్నా ఉన్నట్లు సృష్టించి బ్యాంకుల్లో రుణాలు, రైతు బీమా స్వాహా చేయడంతోపాటు అమాయక రైతులను బురిడీ కొట్టించి, వారికి తెలియకుండానే వారి పేరిట పలు బ్యాంకుల్లో రుణాలు కాజేసిన ఆ ఘనుడి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పీఏసీఎస్ వద్ద ఉండగా మహమ్మదాబాద్ పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం మహమ్మదాబాద్ పోలీస్స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు.
జిల్లా అధికారుల విచారణ..
ఆర్డీఓ నవీన్, జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశం, ఏడీఏ రాంపాల్, లీడ్బ్యాంకు మేనేజర్ గండేడ్ తహసీల్దార్ కార్యాలయంలో అక్రమాలపై విచారణ చేపట్టారు. బాధితులను పిలిపించి వారి వద్ద ఏయే ఆధారాలు ఉన్నాయో ఆరాతీశారు. భూమి విస్తీర్ణం మార్చడంపై ఆర్డీఓ నవీన్ రికార్డులు పరిశీలించారు. ఆరోపణలు వచ్చిన సర్వే నంబర్లలో ఎంతెంత భూమి ఉందన్న వివరాలు తెలుసుకున్నారు. అలాగే రైతు బీమా ఏమైనా కాజేశారా అన్న విషయాలను కూడా జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశం, ఏడీఏ రాంపాల్ పరిశీలించారు. నకిలీ మరణ ధ్రువపత్రాల జారీకి సంబంధించి వాస్తవాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓ నవీన్ ఎంపీడీఓ హరిశ్చంద్రారెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు ఆన్లైన్ రికార్డులు పరిశీలించి సోమవారం నివేదిక ఇస్తామని ఎంపీడీఓ పేర్కొన్నారు. ‘సాక్షి’లో వచ్చిన అన్ని అంశాలపై సంబంధిత అధికారులు శాఖల వారిగా విచారణ కొనసాగించారు. అనంతరం గండేడ్ ఎస్బీఐలోనూ వివరాలు సేకరించారు. పీఏసీఎస్లో సైతం జిల్లా అధికారులు రుణాల దుర్వినియోగంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్రావు, ఏఓ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనాలు
వరుస కథనాలకు స్పందించినజిల్లా యంత్రాంగం
తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, బ్యాంకుల్లో విచారణ

పోలీసుల అదుపులో ‘ఘరానా దొంగ’