● తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబంతో కలిసి మహిళా రైతు ధర్నా
రాజాపూర్(బాలానగర్): రెండెకరాల్లో ఒక ఎకరా పొలం రోడ్డులో పోగా.. మరో ఎకరా ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారని.. తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళా రైతు కుటుంబంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. బాలానగర్ మండలకేంద్రానికి చెందిన సులోచనదేవికి సర్వే నంబర్ 139/1, 139/2లో రెండెకరాల పట్టా పొలం ఉండేది. ఒక ఎకరా రోడ్డు విస్తరణలో పోగా మరో ఎకరా పొలం ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగకపోవడంతో ఆమె తన కుమారులతో కలిసి మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ధర్నా దిగింది. జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఆల్వాల్రెడ్డి మద్దతు తెలిపారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్లో నిరాహార దీక్ష చేపడతామని పేర్కొన్నారు.