● డీఎంహెచ్ఓ రవి రాథోడ్
నెహ్రూసెంటర్: ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్ఓ బి.రవిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని దీప్తి ఆస్పత్రి, పొనుగోటి, వెన్నెల, వీరభద్ర ఆస్పత్రులను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. రోగుల ప్రయోజనార్థం ప్రతీ సేవకు సంబంధించిన రుసుము, అందుబాటులో ఉన్న సౌకర్యాలను స్థానిక భాషతో పాటు ఆంగ్ల భాషలో స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బయోమెడికల్, పొల్యూషన్, తదితర అవసరమైన లైసెన్స్లను స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలని తెలిపారు. అలాగే కన్సల్టెంట్ వైద్యుల జాబితాను స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలని, అగ్నిమాపక శాఖ (112), పోలీస్ (100), అత్యవసర సేవ (108)ల మొబైల్ నంబర్లను సంస్థ ప్రాంగణంలో ప్రదర్శించాలన్నారు. నిబంధనలు పాటించకపోతే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్లలో పరీక్షలు అనుమతి పొందిన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్టులు మాత్రమే గర్భిణులకు స్కానింగ్ చేయాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని తెలిపారు.


