● రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు
మేక సునీల్రెడ్డి
● ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ
కురవి: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రైతు కమిషన్ అధ్యయనం చేస్తున్నదని, రైతుల సమస్యలను క్రోడికరించి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు మేక సునీల్రెడ్డి(భూమిసునీల్) అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐకేపీ, ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి తనిఖీ చేశారు. రైతులను కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లోని రిజిస్టర్లను స్వయంగా పరిశీలించారు. మిల్లర్లు ధాన్యంలో కోత విధిస్తున్నారని పలువురు రైతులు ఆయనకు వెల్లడించారు. లారీలు సక్రమంగా రావడంలేదని రైతులు తెలిపారు. తరలింపు ఆలస్యమై కేంద్రాల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆయనకు రైతులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రైతులకు కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలను త్వరలోనే కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల సమస్యలకు పరిష్కా రం వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం వెంటవెంటనే తరలించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఏపీఎం దుర్గారావు, ఏఓ నరసింహారావు, ఆర్ఐ లక్ష్మి, రైతులు మేక దామోదర్రెడ్డి, బత్తిని నరసయ్య, బెడద వీరన్న తదితరులు ఉన్నారు.


