కమిటీని స్వాగతిస్తున్నాం..
తొర్రూరు రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలు చేసిన ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు గుర్తింపు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ముద్దసాని వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఉద్యమకారుల ఫోరం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఫోరం నాయకులు అనేపురం వెంకన్నగౌడ్, బౌరిశెట్టి అల్లబాబు, కొండ వెంకన్న, వాసిరెడ్డి నర్సింహరెడ్డి, కొదునూరి సధాకర్, వెల్పుల వెంకన్న, పంజాల బుచ్చిరాములు పాల్గొన్నారు..
పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రించాలి
గార్ల: పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిచకుంటే దేశంలో బీజేపీ పతనం తప్పదని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం గార్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జంపాల వెంకన్న, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు,
విద్యార్థుల ప్రతిభ
కురవి: టీజీఆర్జేసీ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో రాజోలు ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ఉపాధ్యాయుడు దామోదర్ మంగళవారం తెలిపారు. పాఠశాలకు చెందిన అక్కాతమ్ముడు యలగం విష్ణుప్రియ, యలగం ఉదయ్ కిరణ్ ర్యాంకు సాధించినట్లు తెలిపారు.
నిధులు కేటాయించాలి
తొర్రూరు: బంజరాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని నిర్మించేందుకు వెయ్యి కోట్ల రూపాలయల నిధులను కేటాయించాలని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటోతు బాలునాయక్, లంబాడ జేఏసీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ ధరావత్ జైసింగ్ నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో చేపట్టిన సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న నాయకులను మంగళవారం పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.
ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షుడిగా కొమరయ్య
డోర్నకల్: తెలంగాణ ఉద్యకారుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడిగా డోర్నకల్కు చెందిన గుంటి కొమరయ్య నియమిస్తున్నట్లు ఉద్యమకారుల ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజినికాంత్, జిల్లా అధ్యక్షులుడు ముద్దసాని వెంకటేశ్వర్లు ప్రకటించారు.
అదుపుతప్పి కారు బోల్తా..
కేసముద్రం: అదుపుతప్పి కారు బోల్తాపడిన సంఘటన మండలంలోని వెంకటగిరి గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇంటికన్నె నుంచి కేసముద్రం వైపు వస్తున్న కారు వెంకటగిరి సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పడంతో బోల్తా కొట్టి పంటభూమిలో పడిపోయింది. కారు డ్రైవర్కు స్వల్పగాయాలైనట్లు తెలిసింది.
విద్యార్థికి సన్మానం
మరిపెడ రూరల్: మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన నూక అశోక్ కుమారుడు నూక సిద్దు ఇటీవల విడుదల చేసిన 2026 ఎప్సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 113వ ర్యాంక్ సాధించాడు. మంగళవారం మాజీ వైస్ ఎంపీపీ గాదె అశోక్రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు.
భాస్కర్రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు
మహబూబాబాద్ రూరల్: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ నాయకుడు, భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కన్మంత రెడ్డి భాస్కర్ రెడ్డి గుండెపోటుతో మంగళవారం మృతిచెందారు. మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లి గ్రామంలో భాస్కర్ రెడ్డి అంతిమయాత్ర సందర్భంగా మదార్ అధ్యక్షతన జరిగిన సంతాపసభ నిర్వహించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కోమటిరెడ్డి అనంతరెడ్డి, నాయకులు పాయం చిన్నచంద్రన్న, ఆలకుంట్ల సాయిలు, రాంసింగ్ పాల్గొన్నారు.
యువత క్రీడల్లో రాణించాలి
పెద్దవంగర: యువత క్రీడల్లో రాణించాలని సర్పంచ్ బానోతు యమున రాజేష్ అన్నారు. మంగళవారం మండలంలోని రెడ్డికుంట తండాలో నిర్వహించిన క్రీడ పోటీలను ఆమె ప్రారంభించారు. వార్డు సభ్యులు బానోతు విక్రం, సీతారాం, భిక్షం, పరమేష్, సునిత, సుధాకర్, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
జీవాల దాహార్తి తీర్చేందుకు
వాటర్ట్యాంక్ల నిర్మాణం
గార్ల: మండలంలోని పెద్దకిష్టాపురం సర్పంచ్ గంగావత్ రాంసింగ్ వేసవికాలంలో పశువులు, మూగజీవాల దాహర్తిని తీర్చేందుకు ఊరి చివర్లలో వాటర్ నిల్వ ట్యాంక్లు నిర్మించి నీళ్లు నింపాడు. సర్పంచ్ ఐడియా భేష్ అంటూ గ్రామస్తులు అభినందిస్తున్నారు.


