తొర్రూరు: కొత్త విషయాలు నేర్చుకునేందుకు, ఉద్యోగార్థులు సన్నద్ధమయ్యేందుకు గ్రంథాలయం దోహదపడుతుంది. 10 రోజులుగా పట్టణంలోని గ్రంథాలయంలో ఫ్యాన్లు తిరగకపోవడంతో పాఠకులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం, సాయం వేళల్లో ఉక్కపోత భరించలేక ఆరుబయటే కూర్చుని పత్రికలు, పుస్తకాలు చదువుకుంటున్నారు. మరికొందరు లైబ్రరీకి వచ్చేందుకు విముఖత చూపుతున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల లైబ్రేరియన్ పదవీ విరమణ పొందగా దీని ఆలనా పాలనా చూసే వారు కరువయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు తాజాగా నూతన చైర్మన్ ఎన్నిక కావడంతో స్థానిక గ్రంథాలయంలో సమస్యలు పరిష్కారమవుతాయని పాఠకులు ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్లు మరమ్మతు చేసి పాఠకుల ఉక్కపోత కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.


