క్రీడల్లో రాణిస్తే ఉపాధి అవకాశాలు
పెద్దవంగర: క్రీడల్లో రాణిస్తే ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీడీఓ బి. వేణుమాధవ్ తెలిపారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. అనంతరం పాఠశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు శ్రీరాం కార్తీక్, కన్నె నందినిలు ఎంపీడీఓ అభినందించారు.
మంత్రిని తొలగించాలి
నెహ్రూసెంటర్: నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి సోమవారం డిమాండ్ చేశాడు. నెలల తరబడి చదువుకుని పరీక్ష రాసిన విద్యార్థులకు తీవ్ర మానసిక వేదన మిగిలిందన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
హామీల అమలు కోసం ఉద్యమిస్తాం..
బయ్యారం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ అన్నారు. మండలంలోని కొత్తపేటలో సోమవారం నిర్వహించిన ఆ పార్టీ రాష్ట్ర స్థాయి జనరల్బాడీ సమావేశంను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బయ్యారం పెద్దచెరువుకు గోదావరి నీటిని తరలించి పంటలకు నీరందించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు పొమ్మయ్య, ఊక్లా, కవిత, దేవేందర్, అంజయ్య, రామచంద్రు పాల్గొన్నారు.
కోతుల పట్టివేత
గార్ల: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సోమవారం గార్ల పట్టణంలో సర్పంచ్ బానోత్ పార్వతి హతీరాం నెల్లూరు నుంచి కోతులను పట్టే వారిని పిలిపించి సుమారు 450 కోతులు పట్టించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఒక్కో కోతికి రూ.300 కోతులు పట్టేవాళ్లకు చెల్లిస్తున్నామన్నారు.
తూము సరిగ్గాలేకనే నీళ్లు వృథా
తొర్రూరు రూరల్: మండలంలోని అరిపిరాల గ్రామ పెద్ద చెరువు తూము సరిగ్గాలేకనే నీళ్లు వృథాగా పోతున్నాయని మత్స్య పారిశ్రామిక సంఘం నాయకులు అన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ గ్రామంలోని కొంతమంది రాజకీయ నాయకులు మత్స్యకారులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ చేపల కోసం చెరువు నీళ్లను వృథా చేస్తున్నట్లు ఆరోపించడం సరికాదన్నారు,
భూములకు హద్దుల ఏర్పాటు
నెల్లికుదురు: మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ భూములకు సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసినట్లు దేవాదాయ శాఖ పరిశీలకులు నందనం కవిత అన్నారు. మండల కేంద్రంలోని దేవాలయ భూముల్లో సోమవారం సర్వే చేసి హద్దు రాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ సర్వేయర్ పసునూరి అనిల్, జూనియర్ అసిస్టెంట్ శేఖర్ పాల్గొన్నారు.
ఇద్దరికి జైలు
ములుగు రూరల్: గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు 10 సంవత్సరాల జైలు శిక్ష , ఒక్కొక్కరికీ రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎస్పీవీ సూర్య చంద్రకళ తీర్పు వెలువరించినట్లు ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ సోమవారం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పల్తియాతండాకు చెందిన పల్తియా శంకర్, వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామానికి చెందిన బూడిద శ్రీకాంత్లపై నేరం నిరూపణకావడంతో శిక్ష విధించారు.


