ప్రజల మన్ననలు పొందాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజల మన్ననలు పొందాలి

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

బయ్యారం: విధి నిర్వహణలో పోలీసులు ప్రజల మన్ననలు పొందేవిధంగా పనిచేయాలని ఎస్పీ శబరీష్‌ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌తో పాటు మక్కల కొనుగోలు కేంద్రం, నామాలపాడులో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను సోమవారం పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండి స్టేషన్‌కు వచ్చే పిటిషనర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. గ్రామాల వారీగా ఉన్న పోలీస్‌ ఆఫీసర్లు యాక్టివ్‌గా పనిచేసి అన్ని గ్రామాల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వేసవికాలంలో చోరీలు జరిగే అవకాశాలు ఉండడం వల్ల ప్రజలకు జాగ్రత్తలు తెలియజేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై దృష్టి సారించినిర్మూలనకు కృషి చేయాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ తిరుపతిరావు, గార్ల–బయ్యారం సీఐ రవీందర్‌, ఎస్సై ప్రశాంత్‌బాబు పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై

రైతుల రాస్తారోకో

గూడూరు: మండలంలోని బొద్దుగొండ గ్రామం వద్ద ప్రధాన జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం మక్క రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో గంటపాటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రంలో మక్కలు కాంటా పెట్టి నెలరోజులు దాటినా.. ఇప్పటి వరకు బస్తాలు తరలించలేదని రైతులు మండిపడ్డారు. ప్రతీరోజు రేపు మాపు తరలిస్తామంటూ నిర్వాహకులు తులెత్తేస్తున్నారని, వాతావరణ మార్పులతో మక్కలు తడిసి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయన్నారు. ఇప్పటికై నా కలెక్టర్‌, అధికారులు, నిర్వాహకులు తమ మక్కలు ఇక్కడి నుంచి తరలించి, డబ్బులు తమ ఖాతాల్లో పడేలా చర్యలు చేపట్టాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై గిరిధర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కొనుగోలుదారులతో మాట్లాడి లారీలు వచ్చే ఏర్పాటు చేయడంతో ఆందోళన విరమించారు.

ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు

గణపురం: సోమవారం పర్వదినం సందర్భంగా గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.

అంత్య పుష్కరాలకు ముస్తాబు

కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు కాళేశ్వరాలయంతో పాటు పరిసరాలు ముస్తాబవుతున్నాయి. సోమవారం రాత్రి కాళేశ్వరం ఆలయ ప్రధాన ఆలయంతో పాటు శ్రీశుభానందదేవి, సరస్వతీఅమ్మవార్ల ఆలయాలతో పాటు ప్రకారాలకు రంగరంగుల విద్యుత్‌ దీపాలు అలంకరించారు. ఆలయం జిగేల్‌మంటుంది.

ఏర్పాట్లు ఇలా..

కాళేశ్వరం ఆలయంలో క్యూలైన్‌లు, షామియానాలు, చలువ పందిర్లు వేశారు. ప్రసాద కౌంటర్లకు క్యూలైన్‌ ఏర్పాట్లు చేశారు. మెట్ల మార్గం నుంచి తోరణాలు ఏర్పాటు చేశారు. వంద గదుల వద్ద భారీ డార్మెటరీ హాలు ఏర్పాటు చేశారు. భక్తులు సేద తీరడానికి శ్రీరాజరాజేశ్వర వసతి గృహం వద్ద షామియానాలు వేశారు.

నిరంతర విద్యుత్‌..

12 రోజుల పాటు నిరంతర విద్యుత్‌ ఉంటుందని ఎన్పీడీసీఎల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ భిక్షపతి తెలిపారు. పుష్కరాల కోసం ప్రత్యేకంగా 490 స్తంభాలు 16 కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్‌ లైన్‌ వేశామని తెలిపారు. 12 ట్రాన్స్‌ఫర్మర్‌లు, 23 పార్కింగ్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement