తొర్రూరు రూరల్: మండలంలోని అరిపిరాల గ్రామంలోని చెరువులో చేపలు పట్టేందుకు నీటిని ఖాళీ చేస్తున్నారు. దీంతో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తనున్నాయని గ్రామ రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో ఉన్న నీటిని రాత్రి వేళల్లో దొంగచాటున చేపల కాంట్రాక్టర్ సంబంధిత నీటి పారుదల, పంచాయతీ, రెవెన్యూ శాఖ అధికారులతో కుమ్మకై తూమును తొలగించడం ద్వారా పెద్ద మొత్తంలో చెరువులోని నీళ్లన్ని వృథాగా పోతున్నాయి. ఇప్పటికి అనేకసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. ఇప్పటికై నా చెరువులో నుంచి వృథాగా పోతున్న నీటిని వెంటనే నిలిపివేసి వేసవిలో గ్రామంలోని ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


