తొర్రూరు: అరకొర వేతనాలతో ఇబ్బంది పడుతున్న తమకు వేతనాలు పెంచి ఆదుకోవాలని మున్సిపాలిటీ పంప్ ఆపరేటర్లు కోరారు. వేతనాలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం డివిజన్ కేంద్రంలో మున్సిపాలిటీ పంప్ ఆపరేటర్లు విధులకు గైర్హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇరవై ఏళ్లుగా పని చేస్తున్నా వేతనాలు గొర్రెతోక బెత్తెడు అన్న చందంగా ఉన్నాయన్నారు. జీతం పెంచాలని మున్సిపాలిటీ అధికారులను వేడుకుంటున్నా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారన్నారు. మున్సిపల్ కమిషనర్ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. సెలవులు లేకుండా పని చేస్తున్నా పనికి తగ్గ గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరారు. పంప్ ఆపరేటర్లు విధులకు గైర్హాజరు కావడంతో పట్టణంలో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ నీటి సమస్య తీరలేదు. కార్యక్రమంలో పంప్ ఆపరేటర్లు బొమ్మనబోయిన కుమార్, గురుకు యాకయ్య, జాటోతు ఠాగూర్, మంగళపల్లి నర్సయ్య, రెడ్డబోయిన రాజు, లాలు యాకయ్య పాల్గొన్నారు.


