బయ్యారం: పంటమార్పిడితో రైతులు ప్రయోజనాలు పొందాలని డీఏఓ బి.సరిత అన్నారు. మండల కేంద్రంలోని సొసైటీ ఆవరణలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు అవసరం మేరకు రసాయనాలను వినియోగించి ప్రకృతి విధానాలను ప్రోత్సహించటం ద్వారా తక్కువ ఖర్చుతో పంటల సాగు చేయవచ్చన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాలను సాగు చేయడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో కేవీకే మల్యాల శాస్త్రవేత్తలు దిలీప్కుమార్, సుహాసిని, ఫార్మ్ మేనేజర్ స్వాతి, ఉద్యానవనశాఖాధికారి మరియన్న, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ రాజు, ఆత్మ డైరెక్టర్ అమృతారెడ్డితో పాటు ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర క్రీడాసాధికార సంస్థ ఆదేశాల మేరకు 14ఏళ్ల బాల బాలికలకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించడానికి అర్హుల నుంచి ఈ నెల 30నుంచి మే 7వతేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి బుధవారం తెలిపారు. దరఖాస్తులను నేరుగా కలెక్టరేట్లోని జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో అందజేయాలని, పూర్తి వివరాలకు 9440630681 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు.
విద్యార్థినికి వేధింపులు!
మహబూబాబాద్ రూరల్/నెహ్రూసెంటర్: మానుకోట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిని జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధించినట్లు తెలిసింది. కొంతకాలం నుంచి సదరు విద్యార్థిని వెంట పడుతున్నాడు. ఈమేరకు సదరు యువకుడు బుధవారం రాత్రి ఆమె ఉండే హాస్టల్ వద్దకు వెళ్లి ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. భయాందోళనకు గురైన సదరు విద్యార్థిని తోటి విద్యార్థినులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేసినట్లు సమాచారం. టౌన్ ఎస్సై షాకీర్ను వివరణ కోరగా విద్యార్థిని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.


